Singapore | శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్లో శాస్త్రీయ కర్ణాటక సంగీతంపై విశ్లేషణ ప్రసంగాలు నిర్వహించారు. గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మచే శుక్ర, ఆదివారం సాయంత్రం వేళలో ఈ ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక సంగీత ఆలాపన విధానాలపై విశ్లేషణాత్మక ప్రసంగాన్ని తెలుగువారి కోసం ప్రత్యేకించి అందించారు.
“ఎప్పుడూ వివిధ శాస్త్రీయ, సినీ సంగీత కార్యక్రమాలను సింగపూర్లో ఏర్పాటు చేస్తూనే ఉంటామని, కానీ తొలిసారి ఈ విధంగా వర్థమాన గాయనీగాయకులకు ఉపయోగపడే విధంగా.. శాస్త్రీయ సంగీత ఆలాపనా విధానాలపై మరింత అవగాహనను పెంచే విధంగా.. మెళకువలను నేర్పే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని” శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి సహకరించిన విద్య సంగీతం, స్వరలయ సంస్థలకు కృతజ్ఞతలు తెలియచేశారు. శుక్రవారం జరిగిన కార్యక్రమానికి విద్య సంగీతం నుంచి విద్యాధరి కాపవరపు.. ఆదివారం జరిగిన కార్యక్రమానికి స్వరలయ సంస్థ నుంచి శేషు యడవల్లి, కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చేపట్టారు.
డా. లోకనాథ శర్మ తన విశ్లేషణాత్మక ప్రసంగంలో శాస్త్రీయ సంగీతానికి ఆయువు పట్టైన భావ ప్రకటన ప్రాధాన్యతను గురించి వర్ణించారు. కచేరీలలో కేవలం తమ పాండిత్య ప్రదర్శన కోసం మాత్రమే కాకుండా గాయనీగాయకులు పాటల సాహిత్యంపై, దాని భావంపై దృష్టి పెట్టాలని సూచించారు. కీర్తనల్లో హస్వాక్షరాలను రాగాలాపన కోసం సాగదీస్తే అర్థవంతంగా ఉండదని వివరించారు. గాత్ర సౌలభ్యం కోసం పదాలను నచ్చిన విధంగా విడదీయడం సబబు కాదని అన్నారు. మహా భక్తులైన త్యాగరాజు అన్నమయ్య రామదాసు వంటివారి కీర్తనల విషయంలో భక్తిరసాత్మకంగా మాత్రమే ఆలపించాలన్నారు. ఈ విధంగా వివిధ కీర్తనలను పాడుతూ సంప్రదాయబద్ధంగా ఏ విధంగా పాడాలో కూడా వర్ణిస్తూ వివిధ మెళకువలను తెలియజేశారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సోదాహరణ ఉదాహారణలతో సందేహ నివృత్తి చేశారు.
సింగపూర్లో శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకునే విద్యార్థులు, గాయనీ గాయకులు, సంగీత పాఠశాలలు నడిపే గురువులు, శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి ఉన్న తెలుగువారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి లోకనాథ శర్మతో నేరుగా మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రసంగానంతరం సంస్థ సభ్యులందరూ కలిసి లోకనాథ శర్మ ను ఉచితరీతిన సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’ కూడా కావడంతో వీకెండ్లో ఇటువంటి ఉపయోగాత్మక కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరూ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలుగు భాగవత ప్రచార సమితి సింగపూర్ శాఖ అధ్యక్షులు ఊలపల్లి భాస్కర్, ఇండియా శాఖ అధ్యక్షులు ఊలపల్లి సాంబశివరావు దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమానంతరం అందరూ కలిసి భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి కార్యవర్గ సభ్యులు పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్ దగ్గరుండి భోజనఏర్పాట్లు సమకూర్చారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన దాతలందరికీ పేరు పేరున నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియచేశారు.
రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయనీ గణేశ్న, సుబ్బు వి పాలకుర్తి సాంకేతిక సహకారం అందించారు. ప్రపంచంలోని సంగీతాభిమానులు అందరి కోసం శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్ , ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు. ఈ కింది లింక్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించవచ్చు.