Republic Day | భారతదేశ 74వ గణతంత్ర వేడుకలు కువైట్లో ఘనంగా జరిగాయి. భారత రాయబార కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకలను నిర్వహించారు. చల్లటి వాతావరణంలో సైతం వేడుకలకు భారతీయులు తరలివచ్చారు. రెండు సంవత్సరాల తర్వాత కువైట్లోని భారత రాయబార కార్యాలయం వద్ద వివిధ రంగాలకు చెందిన భారతీయుల భాగస్వామ్యంతో వేడుకలు నిర్వహించారు.
భారత రాయబారి హెచ్ఈ ఆదర్శ్ స్వైక కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నివాలులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ – కువైట్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను గుర్తు చేశారు. కువైట్లోని భారతీయులకు ఎంబసీ సహాయ సహకారాలు అందిస్తుందన్న ఆయన.. సహాయం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.
సహాయం కోసం 24 గంటల వాట్సాప్ నంబర్లు ఉన్నాయని, పరిష్కారానికి నోచుకోని వాటిని వినేందుకు బహిరంగ సభలో వ్యక్తిగతంగా అందుబాటులో ఉంటానన్నారు. ఈ సందర్భంగా కువైట్లో భారతీయ సంఘాలు చేపడుతున్న సేవలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా గుజరాతీ సమర్పన్, రైధున్ గ్రూప్, రిథమ్ స్కేప్, పంజాబీ బాంగ్రా గ్రూప్, బోహ్రా కమ్యూనిటీకి చెందిన ముహమ్మదీ స్కౌట్తో సహా కువైట్లోని అన్ని స్కూల్ విద్యార్థులు, సాంస్కృతిక బృందాలు నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.