BRS Australia | సిడ్నీ: అక్టోబర్లో జరగనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిపాదిత ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతం చేయడానికి సిడ్నీ, కాన్బెర్రాలో నగరాల్లో నిన్న, ఈరోజు బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు, ప్రవాస తెలంగాణవాసులు, సంఘాలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పర్యటనకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన, వివిధ నగరాల్లో నిర్వహించాల్సిన సమావేశాలు, ప్రవాస తెలంగాణవాసులతో ముఖాముఖి కార్యక్రమాలు, యువతతో ప్రత్యేక చర్చలు, అలాగే సమన్వయ కమిటీల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. అదేవిధంగా త్వరలో ఏర్పాటు చేయనున్న నూతన కమిటీలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతంపై పాల్గొన్న వారి అభిప్రాయాలను సేకరించారు.
సిడ్నీ సమావేశంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, సాయిరాం ఉప్పు, రాజేష్ రాపోలు, మర్రి వెంకట్ రెడ్డి సుతారి శ్రీనివాస్, సుతారి మధు, రవిశంకర్ దూపాటి, రవిచింతమణి, మహేష్, సాయి గుప్తా, రామ్ మద్దూరి, లక్ష్మణ్ నల్లన్, రాహుల్, పరశురాం తదితరులు పాల్గొన్నారు. అలాగే కాన్బెర్రాలో నిర్వహించిన సమావేశంలో రవి సాయల, రాకేష్ లక్కరాసు, వీరు సాంబరాజు, అనూప్ రెడ్డి, అజయ్ రెడ్డి తదితరులు పాల్గొని పర్యటన విజయవంతానికి తమ సూచనలు, సహకారాన్ని అందించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేటీఆర్ ఆస్ట్రేలియా పర్యటన ప్రవాస తెలంగాణ సమాజానికి ఒక ముఖ్యమైన సందర్భంగా నిలుస్తుందని, తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ రాజకీయాలు మరియు ప్రవాస భారతీయుల పాత్రపై విస్తృత చర్చలకు ఈ పర్యటన వేదిక కానుందని పేర్కొన్నారు. పర్యటనను విజయవంతం చేయడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
