హైదరాబాద్: టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా యూకేలోని లండన్లో ఉంటున్న ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేశారు. ‘దేశం కోసం కేసీఆర్.. కేసీఆర్ కోసం ఎన్ఆర్ఐ’ అని నినదిస్తూ తెలంగాణ ఉద్యమకారుడు సుమన్ రావు బాలమూరి ఆధ్వర్యంలో సుమారు వంద మందితో మద్దతు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశ ప్రజల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ను స్థాపించడం శుభపరిణామమన్నారు.
ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలన, అమలు చేసిన పథకాలు, తెలంగాణ అభివృద్ధిపై దేశవ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్ లాంటి పాలన తమకుకూడా కావాలని కేసీఆర్కు వినతులువస్తున్నాయని తెలిపారు. నాడు టీఆర్ఎస్ లానే.. నేడు బీఆర్ఎస్ స్థాపన, కార్యాచరణ, ప్రణాళిక బద్ధంగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. బీఆర్ఎస్లో ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషిస్తారని, త్వరలో పార్టీ పెద్దలని కలుస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్లో పనిచేయడానికి, భావజాలాన్ని దేశ వ్యాప్తం చేయడానికి బాధ్యత తీసుకుంటామని చెప్పారు. త్వరలో యూకేలో ఉన్న వివిధ రాష్ట్రాల ఎన్ఆర్ఐలతో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కూడగడతామని సుమన్ రావు పేర్కొన్నారు.