హైదరాబాద్ : భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం (వజ్రోత్సవం) సందర్భంగా శనివారం ‘శ్రీసాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ ఆధ్వర్యంలో సాయంత్రం ‘జయ ప్రియ భారత జనయిత్రీ’ అనే కార్యక్రమం నిర్వహించారు. ప్రఖ్యాత సినీ గేయ రచయిత, 18 సంవత్సరాలు భారత వాయుదళంలో సేవలందించిన శ్రీభువనచంద్ర కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు. చక్కటి ప్రోత్సాహం అందిస్తూ ప్రతీ పాటను తనదైన శైలిలో వ్యాఖ్యానించి ఆశీస్సులు అందించారు. సింగపూర్ లో నివసించే 32 మంది గాయనీ గాయకులు, కవులు, పిల్లలు అందరూ కలిసి మాతృభూమిని కీర్తిస్తూ చక్కటి దేశభక్తి గీతాలు ఆలపించి, కవితలను వినిపించి భారతమాతకు సంగీత సాహిత్య నీరాజనాలు అర్పించారు.
ఈ సందర్భంగా భువనచంద్ర మాట్లాడుతూ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ పిల్లలు, పెద్దలతో ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది దేశ నాయకులను అమరవీరులను స్మరించుకునే అవకాశం లభించిందన్నారు. భావితరాలకు మహనీయుల త్యాగాలను పాటలు, కవితల రూపంలో తెలియజేయడం ఆనందంగా ఉందని అన్నారు. రెండు రోజుల్లో పుట్టినరోజు జరుపుకోబోతున్న భువనచంద్రకు సంస్థ సభ్యులందరూ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ.. 75వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరం కలిసి దేశమాతను స్తుతిస్తూ ఆనందంగా కలిసి గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. సింగపూర్లో ఉండే పిల్లలకు, ఔత్సాహిక కవులకు, గాయనీ గాయకులకు మంచి ప్రోత్సాహం అందించే అవకాశం తమ సంస్థకు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సుబ్బు వి పాలకుర్తి, పంపన సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. సంస్థ కార్యనిర్వాహక వర్గ సభ్యులు రాధిక మంగిపూడి, చామిరాజు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.