హైదరాబాద్ : ముంబై ప్రధాన కేంద్రంగా నెలకొల్పబడిన ప్రముఖ తెలుగు సాంస్కృతిక సంస్థ ‘జనరంజని’ తొలి వార్షికోత్సవ వేడుకలు అంతర్జాల వేదికపై 19, 20 తేదీల్లో ఘనంగా జరిగాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలతో పాటు సింగపూర్, అమెరికా, యూకే నుంచి కూడా ఎంతోమంది అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు కనులవిందుగా జరిగిన ఈ కార్యక్రమంలో జీవీఎల్ నరసింహారావు, బుచ్చి రాంప్రసాద్, వామరాజు సత్యమూర్తి, కామర్స్ బాలసుబ్రమణ్యం వంటి ప్రముఖ రాజకీయవేత్తలు, తెలుగు సంస్కృతి పోషకులు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
జనరంజని వ్యవస్థాపకుడు రుద్రాభట్ల రామ్ కుమార్ మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంగా జనరంజని తరఫున ఎన్నో సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. సభ్యులందరి సహకారంతో మరిన్ని చక్కటి కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. అలాగే అమెరికా నుంచి రమేష్ దేశిభొట్ల, సింగపూర్ నుంచి కవుటూరు రత్న కుమార్ కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు.
మలయాళ లలితాంబికా తపోవనం పీఠాధిపతి సర్వేశ్వరానందగిరి స్వామీజీ జ్యోతి ప్రకాశనం గావించి కార్యక్రమం ప్రారంభించగా.. ప్రముఖ నేపథ్య గాయని దివాకర్ల సురేఖ మూర్తి, గాయకుడు నేమాని పార్థసారథి, వారి శిష్య బృందం చక్కటి సినీ లలిత గీతాలతో అలరించారు. బెంగళూరు నుంచి ప్రహ్లాద ఆచార్య ‘షాడో షో’ లో నీడలతో తెరపై బొమ్మలను ప్రదర్శించిన తీరు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
హాస్యబ్రహ్మ శంకరనారాయణ తమ చక్కటి హాస్య ప్రసంగంతో నవ్వులు కురిపించగా, మండా వరలక్ష్మి హరికథాగానం, కుమారి పగడాల శృతి జానపద గీతాలు, వేముల రంగారావు మురళీవాదన, సింగపూర్ నుంచి గుంటూరు వెంకటేష్ ఈల పాటలు, అత్తిలి అనంతరామ్ హాస్య కథానిక, చిన్నారుల నృత్యాలు మొదలైన అంశాలు అందరిని ఎంతో అలరించాయి.
రాధిక మంగిపూడి, కస్తూరి శివశంకర్, శ్రీలేఖ వారణాసి, దశక చంద్రశేఖర్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. కంభంపాటి మాధవరావు వందన సమర్పణ చేశారు. స్వర మీడియా, ట్రైనెట్ వారు మీడియా భాగస్వాములుగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, పేస్బుక్, స్వర రేడియో ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
కార్యక్రమాన్ని https://youtu.be/UWsZLXPKGz8 అనే లింక్లో చూడవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పెండ్లి అయిన కొద్ది గంటలకే పెండ్లి కొడుకు ఆత్మహత్య
దారుణం : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
ఊహకందని విధంగా రాష్ట్రాభివృద్ధి : మంత్రి సబిత
ఆదిలాబాద్లో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
యుద్ధ ప్రాతిపదికన సిందోల్ రోడ్డు పనులు : మంత్రి హరీశ్ రావు
జయశంకర్ సార్ చరిత్రలో నిలిచిపోతారు