సంగారెడ్డి : తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం రేగోడ్ మండలం సిందోల్ గ్రామ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం సిందోల్ రోడ్డు పనులకు ప్రత్యేక జీవో ద్వారా రూ.2.25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. రోడ్డు నిర్మాణంతో సిందోల్ గ్రామ ప్రజల ఇక్కట్లు తీరుతాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల లోపు రోడ్డు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని పంచాయతీరాజ్ ఎస్ఈని ఆదేశించారు.
కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గినా రైతులకు సంబంధించిన ఏ సంక్షేమ పథకాన్ని ఆపలేదన్నారు.
వానకాలం రైతుబంధు కింద ఈ రోజు వరకు 7 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులు వారి ఖాతాలో జమ చేసామన్నారు. 57 లక్షల 60 వేల 608 మంది రైతులకు రూ.6,012 కోట్ల 72 లక్షలు రైతుల ఖాతాలలో జమ చేసినట్లు తెలిపారు.
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించాలన్నారు. వానకాలం మొక్కజొన్న సాగుకు బదులుగా పత్తి, కంది సాగును చేయాలని సూచించారు. కంది, పత్తి పంటకు మంచి మద్దతు ధర వచ్చేలా చూస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ఒక్కొక్కటిగా అన్ని సౌకర్యాలను కల్పిస్తుందన్నారు.
ప్రభుత్వం త్వరలో ఎస్సీ నిరుద్యోగ యువత కోసం రూ. 1000 కోట్లతో దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ ను ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం కులం, మతం, వర్గాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, అదనపు కలెక్టర్ రాజర్షి షా, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పెండ్లి అయిన కొద్ది గంటలకే పెండ్లి కొడుకు ఆత్మహత్య
ఊహకందని విధంగా రాష్ట్రాభివృద్ధి : మంత్రి సబిత
ఆదిలాబాద్లో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత