కరీంనగర్ కలెక్టరేట్, జూలై 28 : రాష్ట్ర ప్రభుత్వానికి తనపై కోపముంటే తనపైనే తీర్చుకోవాలని, తన నియోజకవర్గంలోని పేద దళితులపై చూపకూడదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు. దళితబంధు రెండో విడుత నిధుల విడుదలపై ప్రభుత్వం ఈ యేడాది జనవరిలో హామీ ఇచ్చినా ఇప్పటి వరకు విడుదల చేయలేదని మండిప్డడారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పలువురు లబ్ధిదారులతో కలిసి మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ చాంబర్లో కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దళితుల అభ్యున్నతిని కాంక్షిస్తూ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించి, 18,500 మంది దళితులకు మొదటి విడుతగా దళితబంధు పథకం వర్తింపజేశారని గుర్తు చేశారు. దీంతో వారంతా వివిధ స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం కొనసాగుతున్నదని మండిపడ్డారు. రెండో విడుతలో ఎంపిక చేసిన 4 వేల నుంచి 5వేల మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదని ఆగ్రహించారు. గతేడాది జనవరిలోనే ఫ్రీజింగ్ ఎత్తేస్తున్నట్టు ఉత్తర్వులు విడుదల చేసినా, ఇప్పటివరకు ఎత్తేయలేదని మండిపడ్డారు. సంబంధిత మంత్రికి పలుసార్లు కలిసి విన్నవించినా పట్టించుకోకపోవడంతో లబ్ధిదారులంతా అనేక ఇబ్బందులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు చేయకుండా సత్వరమే నిధులు విడుదల చేసి దళితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో నడుస్తున్న క్వారీల మూలంగా రహదారులన్నీ అధ్వానంగా మారాయని, కలెక్టర్ నిర్వహించిన రివ్యూల్లోనూ విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి రహదారుల మరమ్మతులకు నిధులు కేటాయించాలని కోరినట్టు తెలిపారు. కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటి ఎత్తివేయడం వల్ల జరిగే ఉపయోగాన్ని ప్రభుత్వానికి నివేదించాలని కోరామని పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోల్నేని సత్యనారాయణరావు, నాయకులు ముసిపట్ల తిరుపతిరెడ్డి, మేకల రవీందర్, సరిగొమ్ముల వెంకటేశ్ ఉన్నారు.