మాక్లూర్, డిసెంబర్ 15 : యోగాసనాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మనస్సుని కూడా ప్రశాంతంగా ఉంచుతాయి. ఆయుష్షును పెంచుతాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిత్యం కొంత సమయాన్ని కేటాయించి యోగాభ్యాసం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఇదే బాటలో నడుస్తున్నది మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామానికి చెందిన యువతి. యోగాసనాలు వేయడం ఆంత సులువా? యోగాసనాలు అంటే ఇదేనా? అని అనిపించాలంటే ఈ యువతి వేసే ఆసనాలు చూడాల్సిందే. ఐదేండ్లుగా శిక్షణ తీసుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నది. క్లిష్టమైన ఆసనాలను సైతం అవలీలగా వేస్తూ పతకాల బాటలో పయనిస్తున్నది. ఇటీవలే జాతీయస్థాయిలో జరిగిన యోగా పోటీల్లో ప్రతిభను చాటింది. మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామానికి చెందిన గోవూరి ఒడ్డెన్న, సరోజ దంపతుల కూతురు రసజ్ఙ.. చిన్ననాటి నుంచే ఆసనాలు వేసేది. పదో తరగతి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయిలో పలు పోటీల్లో ప్రథమస్థానం సాధించింది. ప్రస్తుతం జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటున్నది.
గ్రామంలోని పాఠశాల స్థాయి నుంచే ఆసనాలు వేయడం నేర్చుకున్నది. ఉపాధ్యాయులు సైతం ప్రోత్సహించారు. ఇంటర్ నుంచి యోగా గురువు రాంచందర్ దగ్గర శిక్షణ తీసుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. ఎక్కడ పోటీలు నిర్వహించినా తనదైన శైలిలో ఆసనాలు వేసి ఉత్తమ ప్రతిభ కనపర్చి అందరి ప్రశంసలు అందుకునేది.
యోగా ద్వారా మానసికోల్లాసంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా చదువులోనూ ముందంజలో ఉండవచ్చు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ఇదో సాధనంగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ రోజులో ఒక గంట యోగా చేస్తే ఆయుష్షు పెరుగుతుంది. ఏది చేసినా పదిమందికి ఉపయోగ పడేలా ఉండాలన్నదే నా ధ్యేయం. అన్నామలై యూనివర్సిటీ ద్వారా దూరవిద్యలో యోగాలో పీజీ డిప్లొమా చేశాను. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలీలోని సెంట్రల్ యూని వర్సిటీలో యోగా మాస్టర్గా, వ్యాయామ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తున్నాను.
గత ఏడాది కాలంగా అనాథాశ్రమంలోని విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తుంది. అందులోని విద్యార్థులు సైతం జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. తాను నేర్చుకున్న విద్య పదిమందికి ఉపయోగపడాలని రెండేండ్ల క్రితం జిల్లా కేంద్రంలో డిగ్రీ చదివేటప్పుడు సుభాషన్గర్లోని అనాథాశ్రమం, పాఠశాలలు, కళాశాలల్లో నేర్పించింది. యోగా సాధన ద్వారా ఎలాంటి ప్రయోజనాలుంటాయో పిల్లలకు వివరించింది.
2018లో ఫరీదాబాద్లో జరిగిన 36వ జాతీయ చాంపియన్షిప్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్మెడల్
2018 ఫిబ్రవరిలో తెలంగాణలో యోగా అసోసియేషన్ అధ్వర్యంలో వరంగల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వెండి పతకం
2017 నవంబర్ నిజామాబాద్లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో బంగారు పతకం
2023 మహబూబ్నగర్ కడ్తాల్లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో బంగారు పతకం సాధించింది.