కోటగిరి, డిసెంబర్ 17: విద్యార్థుల క్షేమం కోసం అన్ని వసతులు కల్పించి ప్రభుత్వ సంక్షేమ భవనాల్లో వారి బాగోగులకు కృషి చేస్తున్నది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంటున్నది. అధికారులు చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. అసలే చలికాలం, అపై చన్నీటితో స్నానంతో విద్యార్థినులు నానా అవస్థలు పడుతున్నారు. ఇది కోటగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలోని వసతిగృహ పరిస్థితి. ఇక్కడ ఏర్పాటు చేసిన సోలార్ వేడినీటి యంత్రం మరమ్మతులకు గురవ్వడంతో చన్నీటి స్నానాలే విద్యార్థినులకు దిక్కయ్యాయి. తప్పనిస్థితిలో బోరుబావి నుంచి వస్తున్న నీటిని ట్యాంకులో నిల్వ చేసుకొని అదే చన్నీటి నీటితో స్నానాలు చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.
కోటగిరి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో సోలార్ వేడినీటి యంత్రాలు ఏర్పాటు చేశారు. అవి మరమ్మతులకు గురయ్యాయి. వాస్తవానికి రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి అన్ని వసతి గృహాల్లో విద్యార్థుల స్నానానికి వేడి నీటిని అందించాలనే సూచనలు ఉప్నప్పటికీ ఇక్కడ మాత్రం యంత్రాలు పనిచయడం లేదనే నెపంతో సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థినులు చన్నీటి స్నానాలు చేసి అనారోగ్యానికి గురవుతున్నారు.
చలి బాగా పెరిగింది. పొద్దునే చల్లని నీటితో స్నానం చేయాలంటే భయమేస్తున్నది. స్నానం చేసిన అనంతరం గజగజ వణుకుతున్నాం. ఉపాధ్యాయులకు పలుమార్లు అడిగినా ఉన్నతాధికారులకు చెప్పాం. యంత్రాలు పని చేయడం లేదు ఏం చేస్తామంటూ సమాధానం చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వేడినీటి యంత్రాలను వినియోగంలోకి తీసుకురావాలి.
కోటగిరి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో వేడినీటి యంత్రాలు పనిచేయకపోవడంతో విద్యార్థులు చన్నీటి స్నానాలు చేసి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. అనారోగ్యం బారినపడిన విద్యార్థులకు తప్పనిసరి పరిస్థితి ఉంటే కొంత నీటిని గ్యాస్పై వేడి చేసి ఇస్తున్నాం.