బోధన్, జూలై 17: మున్సిపల్ కార్మికులకు రావాల్సిన పీఆర్సీ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు నెలల పీఆర్సీ వేతన బకాయిలను చెల్లించడంతో పాటు పనిముట్లను ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించాలని, చనిపోయిన, రిటైర్ అయిన కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్చేశారు.
ధర్నా అనంతరం కార్మికుల సమస్యలపై యూనియన్ రాష్ట్ర నాయకుడు బి.మల్లేశ్, కార్మికులు మున్సిపల్ కమిషనర్ జాదవ్కృష్ణతో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మూడు నెలల పీఆర్సీ వేతన బకాయిలను వెంటనే చెల్లిస్తామని, మిగతా మూడు నెలల బకాయిలను వచ్చే నెలలో ఇస్తామని హామీ ఇచ్చారు. చనిపోయిన, రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో వారి వారసులను ఉద్యోగాల్లోకి తీసుకునే విషయమై హైదరాబాద్లోని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ధర్నా కార్యక్రమంలో కార్మిక ప్రతినిధులు కె.గంగామణి, సాయమ్మ, అబ్బయ్య, సరోజని, నాగమణి, గంగామణి, అబ్బవ్వ, పోసాని, రాణి తదితరులు పాల్గొన్నారు.