వినాయక్నగర్, జనవరి 27: నేటి సామాజిక పరిస్థితుల్లో మహిళలు, విద్యార్థినులు, యువతులు ప్రతి ఒక్కరికీ స్వీయ రక్షణ ఎంతో అవసరమని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి , జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుం చాల అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆత్మరక్షణపై న్యాయ విజ్ఞాన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలకు 30 రోజుల పాటు తైక్వాండోలో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. వారి భవిష్యత్తు వారిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఎవరైనా దురుసుగా ప్రవర్తించిన సమయంలో తమను తాము రక్షించుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
బాలికలకు రక్షణగా వ్యవస్థలు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు
బాలిక ప్రగతి, రక్షణ, పురోభివృద్ధికి న్యాయ, పోలీసు, కార్యనిర్వాహక వ్యవస్థలు పని చేస్తున్నాయని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. మహిళలపై అఘాయిత్యాలను నిర్మూలించడంలో ఆత్మరక్షణ అనేది క్రియాశీలకంగా ఉంటుందన్నారు. తన కూతురుకు సైతం తైక్వాండో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు.
ఆత్మరక్షణ.. పదునైన ఆయుధం సీపీ కల్మేశ్వర్
ఆత్మరక్షణ అనేది పాఠశాల, కళాశాల స్థాయిలోనే కాకుండా ప్రమాదకరమైన వ్యక్తుల నుంచి కాపాడుకునేందుకు పనికి వచ్చే పదునైన పనిముట్టు అని సీపీ కల్మేశ్వర్ అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ట్రైనీ ఐపీఎస్ చైతన్య రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్ , టీఎస్ బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, అదనపు డీసీపీ జయ్రాం, అదనపు జిల్లా జడ్జి ఆశాలత, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, జూనియర్ సివిల్ జడ్జిలు గోపికృష్ణ, కుష్బు,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాసు పాల్గొన్నారు. తైక్వాండో శిక్షకుడు మనోజ్ కుమార్ను ఈ సందర్భంగా అధికారులు అభినందించారు.