రామారెడ్డి, మార్చి 22: మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో కాలం వెళ్లదీస్తున్నదని బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ విమర్శించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని వీకేవీ ఫంక్షన్హాలులో శుక్రవారం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించగా.. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పూటకోమాట మార్చుతూ కాలం వెళ్లదీస్తున్నదని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపివేస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా, నిరుత్సాహపడకుండా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుకోసం కష్టపడాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. తాను గెలిస్తే ప్రజా సమస్యలపై పోరాడుతానని అన్నారు. సమావేశంలో ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు, డైరెక్టర్లు, విండో చైర్మన్లు, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.