హైదరాబాద్, ఆగస్టు 5: నిజామాబాద్ నగరంలో అత్యాధునిక వసతులతో కూడిన హోల్సేల్ చేపల మార్కెట్ను నిర్మించడానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మత్స్యకారులు పలు సమస్యలపై మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మత్స్యశాఖకు చెందిన స్థలంలో అత్యాధునిక హోల్సేల్ చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టేందుకు ఉన్నతస్థాయి అధికారులతో ఒక కమిటీ వేసి స్థల పరిశీలన చేసి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మత్స్యశాఖ కమిషనర్ లచ్చీరాం భూక్యాను మంత్రి ఆదేశించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతోపాటు ఇతర నీటి వనరుల ద్వారా పెద్ద ఎత్తున చేపల ఉత్పత్తి జరుగుతుందని, ఇక్కడ చేపల మార్కెట్ నిర్మాణం జరిగితే పరిసర ప్రాం తాల్లో అధిక సంఖ్యలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతున్నదన్నారు. అంతేగాకుండా కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కూడా చేపట్టడం వల్ల పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాలకు చేపలను ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. తద్వారా ఈ ప్రాంతం మత్స్య రంగానికి ఒక హబ్గా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే బేగంబజార్లో హోల్సేల్ చేపల మార్కెట్ను ఎంతో అద్భుతంగా నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కులవృత్తులను ప్రోత్సహించేలా సీఎం కేసీఆర్ నాయకత్వం లో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలుచేస్తోందని అన్నారు. కులవృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. ఆ ఆలోచనలో భాగంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. వీటితోపాటు మత్స్యకారులకు అదనపు ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడాలేని విధంగా రొయ్య పిల్లలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేసిన ఫలితంగా మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని చెప్పా రు. మత్స్యకారులు చేపలను విక్రయించుకోవడానికి రూ.800 కోట్లతో సబ్సిడీపై వివిధ రకాల వాహనాలను పంపిణీ చేశామని తెలిపారు. ఇవేకాకుండా జిల్లా కేంద్రాలు, మున్సిపల్ కేంద్రాల్లో అన్ని వసతులతో కూడిన చేపల మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. మత్స్యకారులు కూడా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధి చెందాలని సూచించారు. తమ పిల్లలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి విద్యావంతులను చేయాలన్నారు. సమావేశంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేశిని మల్లయ్య, పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.