వర్ని, నవంబరు 16 : నిరుపేదల భూములు కాజేసిన చరిత్ర కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిదని బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లి, రూప్లానాయక్ తండా, సక్రియా నాయక్ తండా, పాత వర్ని, హుమ్నాపూర్, నెహ్రూనగర్, వకీల్ ఫారం, అఫంది ఫారం, శ్రీనగర్ గ్రామాల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిరుపేదలైన దళితుల భూములను కబ్జాచేసి వారిని ఇబ్బందులపాలు చేసిన ఘనత ఏనుగు రవీందర్ రెడ్డిదని ఆరోపించారు. అభివృద్ధి పనుల్లో కార్యకర్తల వద్ద కూడా 10శాతం కమీషన్ తీసుకుంటాడని, ఎదురు తిరిగిన వారు ఎవరైనా వారిపై కేసులు బనాయించి ఇబ్బందుల పాలు చేస్తాడని అన్నారు.
బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు తెలివైన వారని.. ఏనుగుకు కనీసం డిపాజిట్ కూడ దక్కకుండా ఓడిస్తారన్నారు. పాత వర్ని గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి పాత వర్ని గ్రామాన్ని కొత్తగా రూపుదిద్దానని అన్నారు. అసైన్డ్ భూములను రెగ్యులర్ చేసి క్రయ విక్రయాలు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామాలను అభివృద్ధి చేశానని, మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి సహకార సంఘం మాజీ చైర్మన్ ముకుంద్రావ్ మాట్లాడుతూ ఏనుగు రవీందర్ రెడ్డి డబ్బుకోసం ఎలాంటి నీచానికైనా ఒడిగడతాడని ఆరోపించారు.
కమీషన్ల కోసం సొంత పార్టీ కార్యకర్తలపై కూడా కేసులు బనాయించిన ఘనత ఆయనదని అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా బాన్సువాడలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్న పోచారం శ్రీనివాస రెడ్డికి ఓటు వేసి గెలిపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వర్ని జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, మండల కో ఆప్షన్ సభ్యుడు కరీం, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, బీఆర్ఎస్ నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి, సర్పంచులు మైసం వెంకటేశ్వర్లు, శ్రీనగర్ రాజు, ఎంబడి పద్మా నాగభూషణం, ఉండవల్లి సత్తిబాబు, సంతోష్ కులకర్ణి, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.