ఎల్లారెడ్డి (సదాశివనగర్)/ ఎల్లారెడ్డి, మే 28: ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే రైతులకు అండగా ఉంటామని, వారికి కష్టం వస్తే వారితో కలిసి ఆందోళనలో పాల్గొంటామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గురువారం ఆయన సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి, ధర్మారావ్ పేట, ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ గ్రామంలో పర్యటించారు. అడ్లూర్ ఎల్లారెడ్డి, ధర్మారావ్ పేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక రైతులు లారీల సమస్యను వివరించారు.
అనంతరం జాజాల మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు కష్టాలు వస్తున్నాయని మండిపడ్డారు. ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం నెలకొనడంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతున్నదన్నారు. అకాల వర్షాలతో వడ్లు తడిసిపోతున్నాయని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంటనే తరలించాలని, ఈ విషయమై కలెక్టర్తో మాట్లాడుతానని అన్నారు. రెండు రోజుల్లో ధాన్యాన్ని పూర్తిగా తరలించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. జాజాల వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.