బిచ్కుంద, మార్చి 26: తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, జుక్కల్లో ఎగిరేది గులాబీ జెండేనని చెప్పారు. బిచ్కుంద మండలం వాజిద్నగర్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హన్మంత్షిండే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో యాసంగి, వానకాలం సీజన్లలో రైతులు పుష్కలంగా పంటలు పండించుకొని, అప్పులు లేకుండా సంతోషంగా గడుపుతున్నారన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, పింఛన్లలాంటి అనేక సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు బీఆర్ఎస్ను గెలిపిస్తారని చెప్పారు. మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్య మహిళా పథకం, కంటి వెలుగు శిబిరాల ద్వారా నిరుపేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కండ్లద్దాలు అందజేస్తున్నామని వివరించారు. నిజాంసాగర్ మండలంలో రూ.476 కోట్లతో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పథకం పూర్తయితే బిచ్కుంద మండలం సస్యశ్యామలమవుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జుక్కల్కు సరిహద్దులో ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపమని కోరుతున్నారని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్నారని గుర్తుచేశారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఈగ వాలకుండా కంటికిరెప్పలా కాపాడుకునే బాధ్యత తనపై ఉన్నదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పీటీసీ భారతీరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు, పుల్కల్ సొసైటీ చైర్మన్ రాంరెడ్డి, బిచ్కుంద సొసైటీ చైర్మన్ బాలాజీ, వాజిద్నగర్ సర్పంచ్ అనూయ, ఎంపీటీసీ సాయిలు, గ్రామ కమిటీ అధ్యక్షుడు సంతోష్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సిద్ధిరాంపటేల్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ పటిష్టతకు కృషిచేస్తాం..
రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారు. దీంతో వ్యవసాయం పండుగలా మారి రైతులంతా లక్షాధికారులవుతున్నారు. ఆత్మీయ సమ్మేళనం నిర్వహణతో కార్యకర్తల్లో ధైర్యం పెరిగింది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. జుక్కల్ ఎమ్మెల్యేగా హన్మంత్షిండేను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం.
–రాంరెడ్డి, పుల్కల్ సొసైటీ చైర్మన్
సైనికుల్లా పనిచేయాలి..
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అన్నివర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తున్న బీఆర్ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి. అభివృద్ధి పనులు చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటున్న ఎమ్మెల్యే హన్మంత్షిండేను మళ్లీ గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేయాలి.
– అశోక్పటేల్, ఎంపీపీ, బిచ్కుంద