ఖలీల్వాడి, మార్చి 4: వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మార్చి ప్రారంభం నుంచే పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్పై భానుడి ప్రతాపం క్రమంగా పెరుగుతున్నది. వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత తీవ్రంగా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎండ ఎక్కువగా ఉండడంతో ఉదయం 9 గంటల తర్వాత బయటికి వెళ్లేందుకు జనం భయపడుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు, విద్యార్థులు అందరూ అవస్థలు పడుతున్నారు.
పగలు చల్లదనం కోసం తహతహలాడిన వారు రాత్రయిందంటే ఉక్కపోతతో తల్లడిల్లుతున్నారు. మధ్యాహ్నం 12గంటల నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. గతంలో కన్నా ఈసారి ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతేడాది అత్యధికంగా మే మాసంలో 46.6 డిగ్రీలుగా రికార్డు అయింది. ఈ సీజన్లో వర్షాలు అంతంత మాత్రంగానే పడడంతో నీళ్లులేక వ్యవసాయ భూములు ఎండిపోతున్నాయి. పిల్లలు, గర్భిణులకు ఎండలు మంచివి కావని, రక్షణ చర్యలు తీసుకోకుండా బయటికి రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటి నుంచే ఎయిర్ కూలర్, రంజన్లను కొనుగోలు చేస్తున్నారు.