ఏర్గట్ల/ మోర్తాడ్, అక్టోబర్ 26: బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రపంచరాజకీయ చరిత్రలోనే ఇప్పటివరకు రానటువంటిదని, సూపర్డూపర్ మ్యానిఫెస్టో అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంతోపాటు ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో గురువారం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తాళ్లరాంపూర్లో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిసి పాల్గొన్నారు. ఈ రెండు సమావేశాల్లో మంత్రి వేముల మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలే తన బలం..బలగమని, తనకు ఎల్లప్పుడూ వెన్నంటి నిలిచారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.ప్రజలకు పాలన అందుబాటులో ఉండేలా ఏడు గ్రామాలతో ఏర్గట్లను మండలంగా ఏర్పాటు చేసి, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఏర్గట్ల మండలంలో పది వేల ఓట్లు పోలైతే అందులో 9200 ఓట్లు కారు గుర్తుకు పడాలన్నారు. ఆ దిశగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాన్నారు.గతంలో అస్తవ్యస్తమైన కరెంట్తో తెలంగాణ ప్రజలు గోస పడ్డారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ సుమారు రూ. లక్ష కోట్లతో కరెంట్ వ్యవస్థను గాడిలో పెట్టి విద్యుత్ సమస్య లేకుండా చేశారని తెలిపారు.
రైతుకు రైతు బంధు, రైతుబీమా సాగు నీరు, సకాలంలో ఎరువులు ఇచ్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు బాంధవుడిగా నిలిచారని కొనియాడారు. కేసీఆర్ సర్కార్ రైతుల కోసం చేస్తున్న కార్యక్రమాలు చూసి వ్యవసాయ రంగ నిపుణులు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు.14 ఏండ్లు తెలంగాణ కోసం పోరాడి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఓ వైపు , ఓటుకు నోటు కేసులో పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగ రేవంత్రెడ్డి, తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే అమెరికా పారిపోయిన కిషన్ రెడ్డి మరో వైపు ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులని, వారికి ఎవరు మంచి చేస్తారో .. ఎవరు చెడు చేస్తారో..అధికారం కోసం మోసపూరిత హామీలతో వచ్చే వారెవరో బాగా తెలుసన్నారు. కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్న రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి.. కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని అన్నారు. కేసీఆర్ చెప్పింది చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉందన్నారు. కర్ణాటకలో ఆరుగ్యారెంటీలు అని ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్పార్టీ రైతులకు కనీసం రెండుగంటల కరెంటు సరిగా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందన్నారు. తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమపథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలో ఎందుకు లేవని ప్రశ్నించారు. అక్కడ అమలు చేయని పథకాలు ఇక్కడ ఏవిధంగా అమలు చేస్తారని, వారిని ప్రజలు నమ్మరని అన్నారు. ఒక్కోకార్యకర్త ఒక కేసీఆర్ కావాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యకర్తలు తలచుకుంటే ప్రతిపక్ష పార్టీల డిపాజిట్లు గల్లంతవుతాయని అన్నారు.
రైతుబంధు, దళితబంధును నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఈసీ కి లేఖ రాయడాన్ని మంత్రి వేముల ఖండించారు. దళితులను కేవలం ఓటుబ్యాంకుగా వాడుకున్న కాంగ్రెస్ పార్టీ .. వారి అభివృద్ధికి దోహదం చేసే దళితబంధును అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఎప్పుడో ప్రారంభమైన రైతుబంధును నిలిపివేయాలనడం విడ్డూరమన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేశ్రెడ్డి, దొబ్బల రమేశ్, కనిగిరి గంగాధర్, బట్టాపూర్కు చెందిన బత్తుల సంజీవ్, తాళ్ల రాంపూర్ వడ్డెర కాలనీ, ఏర్గట్లకు చెందిన యువకులు, మోర్తాడ్ మండలం ధర్మోరా, పాలెం గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన యువకులు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
బాల్కొండ నియోజకవర్గాన్ని బంగారు కొండగా మార్చిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో ఆయన మాట్లాడుతూ..మంత్రి సహకారంతో ఏర్పాటైన ఏర్గట్ల చిన్న మండలంలో నిర్వహించిన సమావేశానికి పెద్దసంఖ్యలో కార్యకర్తలు రావడం చూస్తుంటే వేముల గెలుపు ఖాయమైందన్నారు. 31 గ్రామాలతో ఉన్న మండడాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయడానికి తనకు నాలుగేండ్లు పట్టిందన్నారు. కానీ మంత్రి వేముల సీఎం కేసీఆర్తో సన్నిహితంగా ఉండడంతో ఏడు గ్రామాలతో ఏర్గట్ల మండలం ఏర్పాటైందన్నారు. నియోజకవర్గాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేశారన్నారు.