బోధన్ : మంజీర నదికి మూడు రోజులుగా వస్తున్న భారీ వరద, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ఫలితంగా జలదిగ్బంధంలో ఉన్న హంగర్గా గ్రామాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం సందర్శించారు. ఆయనతో పాటు జగిత్యాల కేంద్రంగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కార్యాలయం చీఫ్ ఇంజినీర్, ఆ ప్రాజెక్ట్ అధికారులు కూడా హంగర్గా గ్రామానికి తరలివచ్చారు. బోధన్ ఆర్డీవో రాజేశ్వర్తో పాటు వీరు వరదనీటిలో కాలినడకన హంగర్గా గ్రామానికి చేరుకున్నారు. ఒకవైపు వరద ఉధృతితో వణుకుతున్న హంగర్గ గ్రామానికి వెళ్లిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ హంగర్గ గ్రామానికి గ్రామస్తుల సహకారంతో తెప్పలో వెళ్లారు. అక్కడ వరద పరిస్థితిని ప్రత్యక్షంగా చూశారు.
ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఫలితంగా హంగర్గాతో పాటు భిక్నెల్లి తదితర చుట్టుపక్కల గ్రామాలకు ముప్పు ఏర్పడిన విషయాన్ని అధికారులు గమనించారు. ఎస్సారెస్పీ అధికారులకు, అడిషనల్ కలెక్టర్కు భిక్నెల్లి వ్యవసాయ క్షేత్రం యజమాని, అభ్యుదయ రైతు ఎం.అప్పిరెడ్డి వరద పరిస్థితిని వివరించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని పేర్కొన్నారు. బోధన్ మండలం భిక్నెల్లి, ఖండ్గావ్ తదితర గ్రామాలను ఎస్సారెస్పీ చీఫ్ ఇంజినీర్ సుధాకర్రెడ్డి సందర్శించారు.
పంట పొలాలు, వ్యవసాయ క్షేత్రాలు మునిగిపోయిన తీరును గమనించారు. వెంటనే దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి దిగువకు పెద్ద ఎత్తున వరద నీటిని విడుదలచేస్తున్నామని సీఈ సుధాకర్రెడ్డి అన్నారు. వీరితో పాటు అభ్యుదయ రైతు అప్పిరెడ్డి, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, తాసీల్దార్ గఫార్మియా, హంగర్గా సర్పంచ్ శ్యామ్రావు, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఈఈ సత్యనారాయణ, ప్రాజెక్ట్ ఏఈ రవికుమార్ తదితరులు ఉన్నారు.