సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం
120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్నవి బ్యాన్
వాడినా, విక్రయించినా రూ.5 వేల నుంచి 25 వేల వరకు జరిమానా
వాడి పాడేసిన వారికి సైతం రూ.500 వరకు ఫైన్
వ్యాపారులు, ఫంక్షన్హాళ్ల యజమానులకు అవగాహన
విద్యానగర్, జూలై 1: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్పై యుద్ధం ప్రకటించాయి. పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో కార్పొరేషన్, మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేందుకు కసరత్తును ప్రారంభించారు. 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ బ్యాగులు, వస్తువులను వాడకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి పెను ప్రమాదం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై కామారెడ్డి పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు, ఫంక్షన్హాల్ యజమానులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వాడడంవల్ల ఏర్పడే అనర్థాలను వారికి వివరించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా బట్టల బ్యాగులను వాడాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రభుత్వం నిర్దేశించిన 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తయారు చేసిన వారికి రూ. 50 వేలు, అమ్మిన వారికి రూ.2500 నుంచి రూ.5 వేల వరకు, వాడిన వ్యక్తులకు రూ.250 నుంచి రూ.500 వరకు జరిమానా విధిస్తారు. ప్లాస్టిక్ చెత్తను కాల్చిన వ్యక్తులు/సంస్థలకు తీవ్రతను బట్టి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించనున్నారు.
నిబంధనలను అతిక్రమిస్తున్న వ్యాపార సంస్థలు
ప్రభుత్వం ప్లాస్టిక్ వినియోగంపై చర్యలు చేపట్టినప్పటికీ పలు వ్యాపార సంస్థలు పట్టించుకోవడంలేదు. తమ వ్యాపారాల లాభం కోసం ప్లాస్టిక్ను ఇష్టారీతిన వాడుతున్నారు. ప్లాస్టిక్ లేనిదే జీవితం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.వారికి ఎన్ని సార్లు అవగాహన కల్పించినప్పటికీ మార్పు రావడంలేదు. యథేచ్ఛగా ప్లాస్టిక్ వస్తువులు, బ్యాగులను వినియోగిస్తున్నారు. పలువురు నిపుణులు కూడా ప్లాస్టిక్ను వాడవద్దని చెప్పినప్పటికీ ప్రజలు కూడా పట్టించుకోవడంలేదు. చిన్న వ్యాపారస్తుల నుంచి మొదలుకొని పెద్ద పెద్ద వ్యాపారులు ప్లాస్టిక్ బ్యాగులనే వినియోగదారులకు అంటగడుతున్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో చెత్త కన్నా ప్లాస్టిక్ బ్యాగులు, గ్లాసులు, వస్తువులు ఎక్కువగా కనబడడం గమనార్హం. ప్లాస్టిక్ నిషేధంపై ఎన్ని అవగాహన సదస్సులు, ప్రచారాలు చేపట్టినప్పటికీ వ్యాపారుల నుంచి స్పందన రావడంలేదు. ఫంక్షన్ హాలులో కూడా ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నారు. తినే అన్నం ప్లేట్ మొదలు కొని చేతులు కడుక్కునే గ్లాసుల వరకు ప్లాస్టిక్నే వాడుతుండడం గమనార్హం.
ప్లాస్టిక్ వాడడంతో కలిగే నష్టాలు..
ప్లాస్టిక్ ఓ అద్భుతమైన రసాయన సమ్మిళిత పదార్థం. దీనితో అనేక వస్తువులను తయారు చేయవచ్చు. ఇవి అత్యంత అందంగాను, రంగురంగులతో ఉండి అత్యంత చౌకగా ఉండడంతో ప్లాస్టిక్ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. కానీ దీని వలన కలిగే హాని అంతా ఇంతా కాదు.ప్రాథమిక కారణం కాలువలు మూసుకుపోవడం, భూగర్భ జలాల కాలుష్యం మొదలైన వాటితో విచక్షణ రహితంగా ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్లాస్టిక్ భూగర్భంలో కలిస్తే కొన్ని వేల సంవత్సరాలైనా అవి భూమిలోనే ఉంటాయి. దీంతో ప్రాణి కోటికి తీవ్రమైన హాని కలుగుతుంది. ప్లాస్టిక్ రహిత సమాజంగా మారాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది.
నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు ఇవే..
ఇయర్బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు (క్యాండీ స్టిక్స్), ఐస్క్రీమ్ పుల్లలు,అలంకరణ కోసం వాడే థర్మోకోల్ షీట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతో పాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్కులు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, వేడి పదార్థాలు,స్వీట్ బాక్సుల ప్యాకింగ్కు వాడే పల్చ టి రేపర్స్, సిగరెట్ ప్యాకెట్లు,100 మైక్రాన్ల లోపు ఉం డే ప్లాస్టిక్ లేదా పీవీపీ బ్యానర్లు,ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు.
శక్కర్నగర్, జూలై 1 : బోధన్ మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యం విధులు నిర్వహించే బల్జీత్ సింగ్ అనే ఉద్యోగి ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు ప్రచారం ద్వారా అవగాహన కల్పిస్తున్నాడు. తన దగ్గర ఉన్న చిన్నపాటి మైక్సెట్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధంపై పట్టణంలోని వార్డులు, ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నాడు. గతంలో కొవిడ్ ఉధృతి సమయంలోనూ ప్రజలకు అవగాహన కల్పించాడు. మున్సిపల్ అధికారులు ఆయనను పూర్తిగా ప్రచారానికి కేటాయించడంతో ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమాలపై సైతం ప్రచారం నిర్వహిస్తున్నాడు. సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్న బల్జీత్సింగ్ను ప్రముఖులు, పట్టణవాసులు అభినందిస్తున్నారు.
ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలుచేస్తాం..
ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలుచేస్తాం. ఇప్పటికే వ్యాపారులు, ఫంక్షన్ హాళ్ల యజమానులకు అవగాహన కల్పించాం. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్లాస్టిక్ రహిత కామారెడ్డిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం.
– దేవేందర్,కామారెడ్డి మున్సిపల్ కమిషనర్