ఖలీల్వాడి, నవంబర్ 7 : విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలోని జనార్దన్ గార్డెన్లో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనాన్ని మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిగాల హాజరై మాట్లాడారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో విశ్వబ్రాహ్మణులకు భూమి కేటాయించి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయగా, నగరంలోని విశ్వబ్రాహ్మణుల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి తాను నిధులిచ్చానని తెలిపారు. విశ్వబ్రాహ్మణ కులస్తులకు బీసీబంధు ద్వారా రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేశామన్నారు.
నాగారంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం కృషిచేస్తానన్నారు. నగరాన్ని తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను పక్కాగా అమలుచేస్తామని అన్నారు. మరోసారి ఆశీర్వదించాలని, మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యప్రకాశ్, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.