ఇందూరు జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ఊరూవాడా ప్రగతి పరుగులు పెడుతున్నది. ఆంధ్రుల పాలనలో అరవై ఏండ్లు గోసపడ్డ నిజామాబాద్ గడ్డ.. తెలంగాణ సిద్ధించాక సంక్షేమ ఫలాలు అందుకుంటున్నది. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలన స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది. ఇన్నాళ్ల్లూ దిగువకు ఉరకలెత్తిన గోదావరి.. ‘రివర్స్ పంపింగ్’తో తిరిగి వస్తున్నది. ఎన్నో ఏండ్ల పాటు బీళ్లుగా ఉన్న పంట పొలాలకు ప్రాణం పోస్తున్నది. పుట్ల కొద్దీ వస్తున్న ధాన్యం దిగుబడులతో ఇందూరు జిల్లా తెలంగాణ ధాన్యాగారంగా మారింది. సర్కారు ప్రోత్సాహంతో అన్నదాతలు సంతోషంగా ముందుకు ‘సాగు’తున్నారు.
పరిపాలన వికేంద్రీకరణ ఫలితంగా ఊరూరా ప్రగతి బాటలు పడ్డాయి. పల్లెలు పరిశుభ్రంగా మారగా, పట్టణాలు అద్దంలా మెరుస్తున్నాయి. అత్యాధునిక, కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చింది. డయాగ్నోస్టిక్ సెంటర్, డయాలసిస్ సేవలతో పాటు లక్షల విలువైన అత్యాధునిక వైద్య చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా పేదల దరికి చేర్చింది. గురుకులాల ఏర్పాటుతో పాటు కేజీబీవీల బలోపేతంతో నాణ్యమైన విద్యను అందిస్తున్నది. కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో గొల్ల, కురుమ, నాయీబ్రాహ్మణ, రజక, గౌడ, బెస్తలకు సర్కారు దండిగా సాయం చేయడంతో కుల వృత్తులకు పూర్వ వైభవం వచ్చింది. కొత్త కలెక్టరేట్, అద్దంలా మెరిసే రోడ్లు, మినీ ట్యాంక్బండ్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వసతులతో ఇందూరు నగరం సుందరంగా మారింది. ఇప్పటికే పూర్తయిన ఐటీ టవర్ జిల్లాకు మణిమకుటంగా నిలువనున్నది. మొత్తంగా కేసీఆర్ పాలన.. అభివృద్ధి జమానాగా చరిత్రకెక్కింది.
– నిజామాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తెలంగాణ అవతరణ అనంతరం జరుగుతున్న పునర్నిర్మాణ ప్రక్రియ సాదాసీదాగా జరుగుతున్నది కాదు. అరవై ఏండ్లుగా సమైక్య పాలనలో ఛిద్రమైన పరిస్థితులను బాగు చేసుకుంటూ సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. మనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ రాష్ట్ర ప్రజల బాగోగులను చూస్తున్నారు. ఓ వైపు సంక్షేమం, మరోవైపు సుపరిపాలన, ఇంకోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టించి రైతులు, సామాన్య జనాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. దేశమే ఆశ్చర్యపోయేలా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది. అందులో నిజామాబాద్ జిల్లా సైతం అభివృద్ధికి మచ్చుతునకగా మారుతున్నది. ఏ రంగంలో చూసినా ఎనిమిదిన్నరేండ్ల కాలంలో నలుదిశలా అభివృద్ధితో నిజామాబాద్ కొంగొత్తగా రూపొందింది. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో ఈ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలంతా కలిసి కట్టుగా జిల్లాను వృద్ధిలోకి తీసుకువస్తున్నారు. మొదట్నుంచి వ్యవసాయక జిల్లాగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి సాగునీటి చింతను పూర్తిగా తొలగించడం ద్వారా రైతులకు ఎంతో ఉపశమనం కలుగుతున్నది. అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పనలోనూ ప్రజలకు అనేకానేక సౌకర్యాలను కల్పిస్తున్నారు.
– నిజామాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పుష్కలంగా గోదాములు..
పండించిన పంటను నిల్వ చేసుకోవాలంటే గతంలో రైతులు తిప్పలు పడేవారు. వర్షాలు కురిస్తే కల్లాల్లో పంట ఉత్పత్తులు తడిసి ముద్దవ్వడం తప్ప వేరే దారి లేకపోయేది. డబ్బున్న వ్యక్తులేమో పెద్దింట్లో.. లేదంటే ప్రత్యేకమైన గదులు, ప్రైవేటు గోదాముల్లో ఉత్పత్తులను దాచుకునేది. పేద రైతులకు వసతి లేకపోవడంతో చేసేది లేక చేతులెత్తేసే దుస్థితి కనిపించేది. ఇలాంటి దుస్థితికి కేసీఆర్ సర్కారు చరమగీతం పాడింది. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా 19 వ్యవసాయ గోదాములను కొత్తగా నిర్మించింది. పాతవి 34 గోదాములుండగా వీటన్నింటితో జిల్లాలో 1,42,140 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 53 గోదాములు రైతులకు అందుబాటులో ఉన్నాయి. రైతుకు అందించే పెట్టుబడి సాయంలోనూ రాష్ట్ర సర్కారు మానవతను చాటుకుంటున్నది. సంవత్సరానికి ఎకరానికి రూ.10వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ప్రతి సీజన్కు సరాసరిగా 2,60,333 మంది రైతులకు రూ.267.26 కోట్లు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతుబంధు ద్వారా నిజామాబాద్ జిల్లాకు రూ.2,120.90కోట్లు అందించారు.
సాగు ప్రాజెక్టుల సంబురం..
రాష్ట్ర ప్రభుత్వం రూ.892 కోట్లతో సారంగపూర్ సర్జిపూల్ వద్ద ప్యాకేజీ- 20 కింద మూడు పంపులను మంజూరు చేయగా పంప్హౌస్ బిగించే పనులు పురోగతిలో ఉన్నాయి. మంచిప్ప వద్ద రెండు పంపుల నిర్మాణం కోసం ప్యాకేజీ-21కింద రూ.545 కోట్లతో సర్జిపూల్ పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు మంజూరు కాగా మోటర్ డిజైన్లు ఆమోదం కోసం జెన్కో పరిశీలనలో ఉంది. రూ.2413.53 కోట్లతో పరిపాలనా అనుమతులతో మంజూరు చేసి కొండెం చెరువులో నీటిని వదలడానికి ప్రెజర్ మెయిన్స్ వేసే పనులు, ప్యాకేజీ-21(ఏ)లో భాగంగా 25మెగావాట్స్ సామర్థ్యంతో మెట్పల్లి సెగ్మెంట్ పంప్హౌస్ నిర్మాణం, మెంట్రాజ్పల్లి వద్ద పంపుల బిగింపు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్యాకేజీ-21(ఏ)లో భాగంగా 16 మెగావాట్స్ సామర్థ్యంతో గడ్కోల్ సెగ్మెంట్ పంప్హౌస్ నిర్మాణం, నెట్వర్క్ పైప్లైన్ పనులు పురోగతిలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 35 లిఫ్టుల ద్వారా 59,231 ఎకరాలకు సాగు నీరు అందుతున్నది. రూ.9.54కోట్లతో నిజాంసాగర్ ప్రాజెక్టు 15 ప్రధాన, ఉప కాలువల ఆధునికీకరణకు నిధులు విడుదలయ్యాయి. చెరువుల ఆయకట్టు పునరుద్ధరించి సాగు పెంచాలనే లక్ష్యంతో 1147 చెరువులకు 676 చెరువుల పునరుద్ధరణ జరిగింది. 52 చెక్డ్యాముల్లో రూ.162కోట్లతో 32 చెక్డ్యాములు మంజూరయ్యాయి. రూ.11.71కోట్లతో నిజాంసాగర్ చివరి ఆయకట్టుకు నీరు అందించే ఉద్దేశంతో మాక్లూర్ మండలం ధర్మోరా చెరువు ఎత్తిపోతల పథకం కూడా మంజూరైంది.
వైద్యంలో టాప్..
సీఎం కేసీఆర్ ముందుచూపుతో సర్కారు దవాఖానలన్నీ కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా తయారయ్యాయి. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో రూ.5కోట్లతో డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అధునాతన పరికరాలను ఉపయోగించి దాదాపు 57కి పైగా రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 47890నమూనాలను సేకరించగా 82608రోగ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. రూ.లక్షలు ఖర్చయ్యే మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను ఇప్పుడు ఫ్రీగా చేయిస్తోంది. నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలకు కేంద్రంగా మారుతున్నది. వైద్యులు ఇప్పటి వరకు 130మందికి మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ దవాఖానల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు అందుతున్నాయి.
ఎస్సారెస్పీకి పునరుజ్జీవం..
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి 2017, ఆగస్టు 10వ తేదీన సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. రూ.1067 కోట్లతో ఎస్సారెస్పీ నీళ్లను దిగువకు పారించే వరద కాలువలపై మూడు చోట్ల రివర్స్ పంపుల నిర్మాణాల్ని చేపట్టారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కిందకు నీళ్లు పారించిన కాలువల్లోనే మళ్లీ వెనక్కి నీళ్లు వెళ్లేలా దీన్ని డిజైన్ చేసి నిర్మించడం నిజంగా ఇంజినీరింగ్ అద్భుతమే. అనుకున్న విధంగానే రెండేండ్లలోనే పనులు పూర్తయ్యాయి. శ్రీరాంసాగర్ జలాశయానికి కాళేశ్వరం నీటిని చేర్చారు. ముప్కాల్ మండల కేంద్రంలోని మూడో పంప్హౌస్ నిర్మాణం కూడా ఇదివరకే పూర్తయ్యింది. ఎస్సారెస్పీలో నీళ్లు లేని సమయంలో నేరుగా కాళేశ్వరం జలాలను ప్రాజెక్టులోకి మళ్లించనున్నారు. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ నుంచి ఎత్తిపోసిన నీళ్లు ఇప్పుడు రాంపూర్కు 4కిలోమీటర్ల దూరంలో ఉన్న నూకపల్లి వరకు చేరుకుంటున్నాయి. ఎస్సారెస్పీ వరకు ప్రతి 30 కిలోమీటర్ దూరానికి ఒక రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు ఉండడంతో మూడు చోట్ల నీళ్లు నిల్వ అవుతూ అక్కడి నుంచి వేగంగా ముందుకెళ్తుండడం విశేషం. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వరద కాలువ నుంచి 0.100 కిలోమీటర్ పాయింట్ వద్ద మూడో పంప్హౌస్లోని మోటర్లతో ఎత్తిపోయడం ద్వారా ఎస్సారెస్పీ నిరంతరం జలజీవంతో ఉండబోతున్నది.
ధాన్యాగార మవుతోన్న జిల్లా..
రైతుకు సకాలంలో ఎరువులు, విత్తనాల దగ్గరి నుంచి ఉచిత విద్యుత్ అందుతుండడంతో రెండు కాలాల్లో సమృద్ధిగా పంటలను పండిస్తున్నారు. ఫలితంగా నిజామాబాద్ జిల్లా ధాన్యాగారం అవుతున్నది. ప్రతి వానకాలం, యాసంగి సీజన్లో అగ్రగామిగా నిలుస్తూ రాష్ట్రంలోనే నిజామాబాద్ ముందు వరుసలో ఉంటున్నది. నిజామాబాద్ జిల్లాలో 2021-22 వానకాలం సీజన్లో 458 కేంద్రాల ద్వారా 89,413 మంది రైతుల నుంచి 6లక్షల 86వేల 155 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశారు. రూ.1340.05కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. 2021-22 యాసంగిలో 460 కేంద్రాల ద్వారా 6లక్షల 35వేల 905 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 81,239 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.1238.59కోట్లు రైతుల ఖాతాలో వేశారు. 2021- 2022 వానకాలంలో 79,077 మంది రైతుల నుంచి 5లక్షల 85వేల 661 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా రూ.1204.36 కోట్ల చెల్లింపులు జరిపారు.
జోరుగా పట్టణ ప్రగతి..
పట్టణ ప్రగతిలో భాగంగా నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలకు రూ.116.07 కోట్లు మంజూరు కాగా నిజామాబాద్ నగరానికి రూ.38.33కోట్లు కేటాయించారు. ఇందులో 227 సీట్ల టాయిలెట్లు, 2 బస్ టాయిలెట్లు, పారిశుద్ధ్య యంత్రాలు, 16వైకుంఠధామాల నిర్మాణం, 2 వైకుంఠ రథాలు, 32 ఓపెన్ జిమ్లు, 1734 కొత్త ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్ పోల్స్, 6 లక్షల మొక్కల సెంట్రల్ నర్సరీ, జైల్ నర్సరీ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు చేపట్టారు. బోధన్ మున్సిపాలిటీలో రూ.1.60కోట్లతో 20 ఆటోటిప్పర్లు, రూ.82లక్షలతో స్వీపింగ్ మిషిన్లు, రూ.15లక్షలతో వైకుంఠరథాలు, రూ.50లక్షలతో వైకుంఠధామాలను అభివృద్ధి చేశారు. డంప్యార్డు వద్ద మలవ్యర్థ శుద్ధీకరణ కేంద్రం నిర్మాణంలో ఉండగా ఆర్మూర్లో 5 క్రీడా ప్రాంగణాలు, రూ.13లక్షలతో బస్తీ దవాఖాన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. భీంగల్లో రూ.30లక్షలతో పబ్లిక్ టాయిలెట్లు, శానిటేషన్ కోసం జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు, వాటర్ ట్యాంకర్లు, ఫాగింగ్ మిషన్లు, స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేశారు. నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వం 14,825 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయగా వీటిలో 14,797 ఇండ్లకు పరిపాలనా అనుమతులు వచ్చాయి. అనేక చోట్ల పనులు పూర్తి చేసుకోగా పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని పలు విడుతల్లో అమలు చేసింది. మరికొంత మందికి త్వరలోనే చెల్లించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. రూ.25వేలలోపు రుణం పొందిన 17,711 మంది రైతులకు రూ.20.10కోట్ల మాఫీ జరిగింది. రూ.50వేలలోపు రుణం పొందిన 27,601 మంది రైతులకు రూ.85.85 కోట్లు మాఫీ అయ్యాయి. గ్రామాల్లో జవజీవాలను కల్పించే ఉద్దేశంతో 2021-22లో 12.50 కోట్ల చేపపిల్లల ఉత్పత్తి లక్ష్యం కాగా అందులో 4.16కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేశారు. 77.92లక్షల చేప పిల్లలను నిజామాబాద్ జిల్లాతోపాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేశారు. 2022-23లో 10కోట్ల చేపపిల్లల ఉత్పత్తిలో 3కోట్ల చేపపిల్లలను ఇప్పటి వరకు ఉత్పత్తి చేశారు. రూ.2.22కోట్లతో 85.57లక్షల రొయ్య పిల్లలను 24చెరువుల్లో వదలగా గడిచిన సీజన్లో 4.85కోట్ల చేపపిల్లలను వదిలారు. గొల్ల, కుర్మలకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు 2017-18 నుంచి ఇప్పటి వరకు 10,722 యూనిట్ల రూపంలో 2,25,162 జీవాలకు రాయితీ అందించగా మరో 1,76,064 జీవాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
మణిహారంగా కళాభారతి..
ఇందూరు సిగలో మరో మణిహారం చేరనున్నది. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థలంలో కళాభారతి ఆడిటోరియం నిర్మాణ పనులు మొదలయ్యాయి. రూ.50కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తున్నది.
రైతు కేంద్రంగా జిల్లా సర్వతోముఖాభివృద్ధి
బోధన్, మార్చి 17: రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్ప టి వరకు జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలో జిల్లా అభివృద్ధి అంతా రైతు కేంద్రంగా జరిగింది. నీటిపారుదల రంగానికి సంబంధించి అనేక పనులు జరిగా యి. జిల్లాలో ఒకప్పుడు బీటలువారిన చెరువులు మిషన్ కాకతీయతో జలకళను సంతరించుకున్నాయి. వ్యవసాయరంగానికి ఉచిత కరెంట్, రైతుబంధు పథకం అమలు, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ.. ఇలా రైతుల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. దీంతో జిల్లా సమగ్రంగా అభివృద్ధిని సాధించేందుకు అవకాశం ఏర్పడింది.
– కేపీ శ్రీనివాస్రెడ్డి, రైతు నాయకుడు, బోధన్
జిల్లా రూపురేఖలు మారాయి..
బోధన్, మార్చి 17: ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధిలో ఎంతో వెనుకబడిన నిజామాబాద్ జిల్లా తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ధిని సాధించింది. ఒకనాడు జిల్లాలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్థితి ఉండేది. తెలంగాణ వచ్చినంక.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జిల్లాలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. పల్లెప్రగతితో గ్రామాలు ఎంతో సుందరంగా కనిపిస్తున్నాయి. మట్టి రోడ్ల స్థానంలో ఎక్కడచూసినా తారురోడ్లు, సీసీ రోడ్లు కనిపిస్తున్నాయి. అంగన్వాడీలకు, గ్రామ పంచాయతీలకు సొంత భవనాలను నిర్మిస్తున్నారు. ఇంతటి అభివృద్ధిని గతంలో ఎప్పుడూ చూడలేదు.
– టి.ఇంద్రకరణ్, న్యాయవాది, బోధన్