నిజామాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మోసపూరిత పార్టీలను నిలదీసే గ్రామంగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం ప్రత్యేకతను సంతరించుకున్నది. ఆ ఊరి జనాల చైతన్యం ఇప్పుడు మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. హామీలు అమలు చేయని వారిని ప్రశ్నిస్తున్న ఈ గ్రామ ప్రజలు.. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను నిగ్గదీశారు. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి టి.జీవన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదివారం రాత్రి గన్నారంలో ప్రచారానికి వచ్చారు. ఊకదంపుడు ప్రసంగాలు చేస్తోన్న తరుణంలో ఓపిక నశించిన గ్రామస్తులు ఒక్కసారిగా రివర్స్ అయ్యారు. చెప్పింది చాలు.. పింఛన్లు ఏవి? నీళ్లు ఏవి? కరెంట్ ఏది? అని రైతులు, మహిళలు గట్టిగా ప్రశ్నించారు. దీంతో అధికార పార్టీ నేతలంతా తెల్లముఖం వేశారు. ప్రజల ప్రతికూల స్పందనను గమనించిన కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఏమి చేయాలో తెలియక తికమక పడ్డారు. తీరా ఎమ్మెల్యే భూపతిరెడ్డి కలుగజేసుకుని, మాట్లాడుతుండగా ఎవ్వరూ మధ్యలో అంతరాయం కలిగించొద్దంటూ కోరారు. అయినప్పటికీ మహిళలు తమ బాధను, తమలోని ఆక్రోశాన్ని నిర్మొహమాటంగానే బయట పెట్టడం ఆశ్చర్యపర్చింది. మూడేండ్ల క్రితం కూడా ఇలాగే.. గ్రామానికి వచ్చిన ఎంపీ ధర్మపురి అర్వింద్కు పరాభవం ఎదురైంది. ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లోనే పసుపుబోర్డు తెస్తానని చెప్పి మాట తప్పిన అర్వింద్ను గన్నారం గ్రామస్తులు ముఖం పట్టుకుని నిలదీశారు. పసుపుబోర్డు ఏర్పాటు ఎక్కడ? అని 44వ జాతీయ రహదారి పొడవునా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాండ్ పేపర్ హామీ ఏమైందంటూ రైతులు చాలా మంది అడగడంతో కంగుతిన్న అర్వింద్ ఏమి చేయలేక ఆగమాగం కావాల్సి వచ్చింది. తీరా కారు ఆపితే ఎక్కడ తనపై దాడి చేస్తారోనన్న భయంతో వేగంగా దూసుకెళ్లారు.