డిచ్పల్లి, జూన్ 13 : రెండు నెలలుగా నిత్యం వివాదాలు చోటుచేసుకుంటుండడంతో తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాష్ట్రస్థాయిలో చర్చాంశనీయంగా మారింది. టీయూను గాడిలో పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. ఈనెల 6వ తేదీన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం టీయూను సందర్శించి, ముఖ్యమైన హార్డ్డిస్క్లు, రికార్డులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్కు చెందిన ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారుల బృందం మరోసారి వర్సిటీలోని ఐదు విభాగాలను సందర్శించి తనిఖీలు చేపట్టింది. ఆయా విభాగాల హెడ్ల నుంచి జమాఖర్చులు, లావాదేవీల విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఏవో కార్యాలయం, ఎస్టాబ్లిష్మెంట్ కార్యాలయం, అకౌంట్ సెక్షన్, ఇంజినీరింగ్ విభాగాలను అధికారులు వేర్వేరుగా తనిఖీ చేశారు. మాజీ రిజిస్ట్రార్గా పనిచేసిన విద్యావర్ధిని, ప్రిన్సిపాల్ ఆరతికి విచారణకు హాజరుకావాలని ఆదేశించగా.. ఆ సమయంలో వారు వర్సిటీలో అందుబాటులో లేరు. జమాఖర్చుల విభాగంలో సంబంధిత శాఖ అధికారి భాస్కర్తో మాట్లాడి క్షుణ్ణంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీసీ తీసుకున్న నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలు, వస్తువుల కొనుగోళ్లకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. ఎస్టాబ్లిష్మెంట్ విభాగానికి అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న సాయాగౌడ్ను సూపరింటెండెంట్ నుంచి అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఎలా ఉద్యోగోన్నతి పొందారో అడిగి తెలుసుకున్నారు. వారి ఎదుటే సెక్షన్లో ఉన్న జ్యోతి, సాయాగౌడ్ మధ్య ఉద్యోగోన్నతులపై వాగ్వాదం చేసుకున్నట్లు సమాచారం. అకాడమిక్ కన్సల్టెంట్లకు బేసిక్ పే ఎంత ఇస్తున్నారు తదితర వివరాలపై ఆరా తీశారు. పదోన్నతులు, బేసిక్ పే, ఇతర వివరాలను నమోదు చేసుకొని అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల వరకు విభాగాల్లోని తలుపులు మూసివేసి తనిఖీ చేపట్టారు.