విద్యానగర్, జనవరి 10 : కామారెడ్డిలో పలు ఇండ్లల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకొని సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్రెడ్డి వివరాలను వెల్లడించారు. గత ఏడాది నవంబర్లో ఇందిరానగర్ కాలనీలో ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి రూ.90 వేలు ఎత్తుకెళ్లారని కొత్తపల్లి శశికళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అడిషనల్ ఎస్పీ అన్యోన్య సూచనలతో డీఎస్పీ సోమనాథం పర్యవేక్షణలో పట్టణ ఎస్సై రాములు, సీసీఎస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి దొంగల కోసం గాలింపు చేపట్టారు. మంగళవారం రామారెడ్డి చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతనిని వెంబడించి పట్టుకొని విచారించగా మరొక వ్యక్తి కూడా పట్టుపడ్డాడు. ఇందులో ఒకరు బాన్సువాడకు చెందిన ఎల్లప్ప అలియాస్ ఒల్లెపు కాశీనాథ్ ప్రస్తుతం కామారెడ్డి బతుకమ్మకుంటలో నివాసం ఉంటున్నాడు.
మరొక వ్యక్తి కామారెడ్డి పట్టణం ఇందిరానగర్ కాలనీకి చెందిన ఉప్పు రాములు. వీరిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. ఎల్లప్ప వివిధ జిల్లాల్లో 28 దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లివచ్చాడు. ఇందులో ఏడు నాన్బెయిలబుల్ వారెంట్లు కూడా ఉన్నాయి. రాములుపై సైతం కామారెడ్డి పోలీసు స్టేషన్లో రెండు కేసులు ఉన్నాయి. వీరి నుంచి టీవీలు, హోంథియేటర్, 4 తులాల బంగారం, రూ.2 లక్షల 20 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. పండుగలకు ఊర్లకు వెళ్లేటప్పుడు తమ విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేసును ఛేదించిన కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, టౌన్ సీఐ నరేశ్, రూరల్ సీఐ శ్రీనివాస్ గౌడ్, సీసీఎస్ సీఐ మల్లేశ్ గౌడ్, కామారెడ్డి ఎస్సైలు రాజు, రాములు, సీసీఎస్ ఎస్సై ఉస్మాన్, సీసీఎస్ సిబ్బంది గణపతి, ముకేశ్, శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, సిబ్బంది రవిని ఎస్పీ అభినందించి రివార్డు అందించారు.