తెలంగాణ యూనివర్సిటీలో ‘గుప్తా’ధిపత్యం నడుస్తున్నది. వీసీ రవీందర్ గుప్తా ఏకపక్ష నిర్ణయాలతో వర్సిటీ ప్రతిష్ట మంట గలుస్తున్నది. అవుట్ నియామకాలు మొదలు రిజిస్ట్రార్ల మార్పు వరకూ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఆయన తీరు మార్చుకోవట్లేదు. తాజాగా రిజిస్ట్రార్ శివశంకర్ను మార్చి మరొకరిని నియమించారు. రాష్ట్రంలో ఏ వర్సిటీలోనూ చోటు చేసుకోని విధంగా 14 నెలల వ్యవధిలోనే ఐదుగురు రిజిస్ట్రార్లను మార్చిన ఘనత టీయూకే దక్కింది. పాలక మండలిని కనీసం సంప్రదించకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం వివాదాస్పదమవుతున్నది. ఒకరిద్దరి తీరు వల్ల తెలంగాణ యూనివర్సిటీ పరువు బజారున పడుతున్నది.
నిజామాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొందరి తీరు వల్ల తెలంగాణ యూనివర్సిటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. నియామకాల విషయంలో తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో వర్సిటీ ప్రతిష్ట మసక బారుతున్నది. రాష్ట్రంలో ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా 14 నెలల వ్యవధిలోనే ఏకంగా ఐదుగురు రిజిస్ట్రార్లను మార్చడం ఈ వర్సిటీకే దక్కింది. తెలంగాణ యూనివర్సిటీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రభుత్వం పూర్తి స్థాయి వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ రవీందర్ గుప్తాను నియమించింది. అయితే ఆయన నియాకమం తర్వాత పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు సరికదా మరింత దిగజారింది. అస్తవ్యస్త నిర్ణయాలతో పరిపాలన వ్యవస్థ గందరగోళంగా మారగా, విద్యార్థుల భవిష్యత్తు కాస్త అగమ్యగోచరంగా మారే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు విరుద్ధంగా వర్సిటీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల దగ్గరి నుంచి తాజాగా మరోసారి రిజిస్ట్రార్ మార్పు వరకు తీసుకున్న నిర్ణయాలు విస్తుగొల్పుతున్నాయి. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వీసీ పోస్టులను ప్రభుత్వం గతేడాది భర్తీ చే సింది. ఓయూకు చెందిన సీనియర్ ప్రొఫెసర్ రవీందర్ గు ప్తాను టీయూ వీసీగా నియమించింది. పూర్తి స్థాయి వీసీతో యూనివర్సిటీ బాగుపడుతుందని అంతా ఆశిస్తే.. ఇక్కడ మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులతో రోజురోజుకూ టీయూ ప్రతిష్ట మసకబారే దుస్థితి ఏర్పడింది.
పేరుకే పాలక మండలి..
తెలంగాణ సిద్ధించాక ఏర్పాటైన కేసీఆర్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల అభివృద్ధికి పెద్ద పీట వేసింది. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీని అభివృద్ధిలోకి తీసుకొచ్చింది. వర్సిటీ పరిపాలన తీరుతెన్నుల కోసం ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా విద్యా, న్యాయ రంగాల నిపుణులతో పాలక మండలి (ఈసీ)ని నియమించింది. యూనివర్సిటీలో ఎలాంటి పనులు చేపట్టాలన్నా… వీసీ తీసుకునే నిర్ణయం ఏదైనా సరే ఈసీ సమావేశంలో చర్చించిన తర్వాతనే అమలు కావాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రతినిధులుగా నియమితులైన పాలక మండలి సభ్యుల ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ఏడాది కాలంగా టీయూలో పాలక మండలి పాత్ర నామమాత్రమైంది. ఈసీ మెంబర్లకు కనీస గౌరవం కూడా లేకుండా పోయింది. అందుకు యూనివర్సిటీకి కీలకమైన రిజిస్ట్రార్ల మార్పే చక్కని ఉదాహరణ. అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం దగ్గరి నుంచి పరిపాలన ఉత్తర్వులు వెలువడే వరకు గోప్యంగా నిర్ణయాలు జరగడం వెనుకున్న ఆంతర్యం ఏమిటన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు.
ప్రభుత్వం హెచ్చరించినా..
వీసీ రవీందర్ గుప్తా తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై గతంలోనే ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. వర్సిటీ ప్రతిష్టను దెబ్బ తీయొద్దని సూచించింది. స్వయంగా ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సైతం ఈసీ సమావేశంలోనే వీసీని తూర్పార బట్టారు. నియామకాల విషయంలో జరిగిన అక్రమాల తంతు వ్యవహారంలో గట్టిగానే చురకలంటించారు. డబ్బు వసూళ్ల విషయంలో వచ్చిన ఆరోపణలపై వివరణ అడగడంతో పాటుగా నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాల్లో చేర్చుకున్న వారిని బయటకు గెంటేయ్యాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. వాస్తవానికి రవీందర్ గుప్తా బాధ్యతలు చేపట్టిన సమయానికి రిజిస్ట్రార్గా నసీమా విధుల్లో ఉన్నారు. కొద్ది రోజులకే రిజిస్ట్రార్గా కనకయ్యను వీసీ నియమించారు. ఈ నియామకానికి ఈసీ ఆమోదం లేకపోవడంతో కనకయ్యను పక్కన పెట్టారు. ఆ సమయంలోనే యాదగిరిని రిజిస్ట్రార్గా నియమించారు. రవీందర్ గుప్తాతో కలిసి పని చేయడం తనతో కాదంటూ ఆయన తప్పుకున్నారు. ఈయన స్థానంలో శివశంకర్ను నియమించారు. అంతా సవ్యంగానే ఉందనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా విద్యావర్ణినిని రిజిస్ట్రార్గా నియమిస్తూ బుధవారం వీసీ ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది.
అడుగడుగునా ఉల్లంఘనలు..
రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు చాన్సలర్గా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. వైస్ చాన్స్లర్గా ప్రభుత్వం నియమించిన వ్యక్తులు బాధ్యతలు నిర్వహిస్తుంటారు. ఐదేళ్ల పాటు వీసీ పోస్టులో ఉండే వ్యక్తులు విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించాలి. ప్రభుత్వం ఆశించిన ప్రగతిని సాధించాలి. ఇందుకు యూజీసీ గైడ్లైన్స్తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించడానికి వీలు ఉండదు. కానీ, తెలంగాణ యూనివర్సిటీలో మాత్రం అడుగడుగునా ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వీసీగా రవీందర్ గుప్తా వచ్చిన తర్వాత ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు రిజిస్ట్రార్లు మారడం చర్చనీయాంశమైంది. ప్రస్తుత వీసీ నిర్ణయాలు రోజుకో తీరుగా గందరగోళానికి దారి తీయడం మూలంగా విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేయడం పరిపాటిగా మారింది. తద్వారా వారి విలువైన సమయం వృథా కావడంతో పాటు అకాడమిక్ వ్యవస్థ ఆగమాగం అవుతున్నది.