వేల్పూర్, డిసెంబర్ 7 : ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను అయోమయానికి గురిచేసి గద్దెనెక్కిందని, హామీల అమలుకు శుక్రవారం నుంచే కౌంట్డౌన్ షురూ అయ్యిందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలన్నీ మార్చి 7వ తేదీ వరకు నెరవేర్చాలని, లేదంటే వెంటాడుతామని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఆయన గురువారం మొదటిసారి నియోజకవర్గానికి వచ్చారు. వేల్పూర్లోని తన నివాసంలో తనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 15 సంవత్సరాల పాటు సుధీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొచ్చిన పార్టీ మనదన్నారు. చావు నోట్లో తల పెట్టి రాష్ట్ర ఏర్పాటు కోసం దేశ రాజకీయాలను ఒప్పించి, రాజకీయ అనివార్యత సృష్టించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. అలా సాధించుకున్న రాష్ర్టాన్ని కేసీఆర్ దేశంలోనే నంబర్ వన్గా నిలిపారన్నారు. 50 ఏండ్లలో చేయని అభివృద్ధిని తొమ్మిదిన్నరేండ్లలో చేసి చూపిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కరెంటు, సాగునీటి తిప్పలు లేకుండా చేశాడన్నారు. అన్నదాతకు పెట్టుబడి కోసం ఇబ్బందులు లేకుండా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పెట్టుబడి సాయాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. పేదలకు రెండు వందల పింఛన్లను రెండు వేలకు పెంచి ఇచ్చారని, దేశంలో ఎక్కడా ఇది లేదన్నారు. ఆడబిడ్డ పెండ్లయితే లక్ష రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులను అందించారన్నారు.
కాంగ్రెస్ నాయకులు కేసీఆర్, తనపై ఆరోపణలు గుప్పిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేశారన్నారు. రెండు శాతం ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసేదాక ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరముందని, ఎవరూ కుంగిపోనవసరం లేదన్నారు. రైతుబంధు, రుణమాఫీ వంటి అంశాలను మూడు నెలల్లో అమలు చేస్తామని ప్రకటించారని.. రేపటి నుంచి కౌంట్డౌన్ స్టార్ట్ అని.. మార్చి ఏడో తారీఖులోపు రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిందేనన్నారు. మహిళలకు బస్సు ఫ్రీ, కరెంట్ బిల్లు, రూ. లక్ష కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, సిలిండర్ రూ.500, ప్రతి మహిళకు 2,500 వంటి మ్యానిఫెస్టోలోని అంశాలను రేపటి నుంచే అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. హామీలను నెరవేరిస్తే సహకారం అందిస్తామని.. ఎగ్గొడితే పోరాటం చేస్తామన్నారు. గ్రామానికి పోయినా మీరు తలెత్తుకుని నిలబడి మాట్లాడేలా కేసీఆర్ అభివృద్ధి చేసి చూపాడన్నారు.. ఎవరికీ తల దించాల్సిన పని లేదని, ధైర్యంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ మితిమీరిన వేషాలు వేస్తే ప్రజలకు అర్థం అవుతుందన్నారు. ఇది విరామం, స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని తెలిపారు. ఇంతకు రెట్టింపు వేగంతో వెళ్తామన్నారు.