కంఠేశ్వర్, జూన్ 22: పథకాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం ఏడాది కాలం నుంచి ఓట్ల సమయంలోనే రైతులకు నామమాత్రంగా పథకాలు అమలు చేస్తూ ఓట్లు లేని సమయంలో పథకాలు ఎగ్గొడుతూ రైతులను మోసం చేస్తున్నదని మండిపడ్డారు.
రైతులకు నేరుగా నగదు బదిలీ పథకం ఎక్కడ లేకున్నా కేసీఆర్ మొట్టమొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం ప్రారంభించారని తెలిపారు. రైతులు నాట్లు వేసే సమయంలోనే ప్రతి పంటకు రైతుబంధు ఇచ్చేవారని గుర్తు చేశారు. కానీ రేవంత్ ప్రభుత్వం మా త్రం కేవలం ఓట్ల సమయంలో మాత్రమే రైతు భరోసా ఇస్తున్నదని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ నుంచి ఇప్పటివరకు నాలుగు పంటలు రాగా మొదటి పంట సమయంలో ఎంపీ ఎన్నికలు వచ్చాయన్నారు. ఓట్ల కోసం మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా రైతుభరోసా రూ.15వేలు కాకుండా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పాత రైతుబంధు పథకాన్ని రైతులకు అందించారని గుర్తు చేశారు. రెండో పంట సమయంలో ఎలాంటి ఎన్నికలూ లేవని, రైతుబంధు ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడోసారి కూడా ఎన్నికలు లేకపోవడంతో తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే ఇచ్చి పెద్ద మొత్తంలో రైతులకు రైతుబంధు ఎగ్గొట్టారని తెలిపారు.
ఇప్పుడు నాల్గోసారి పంట సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్నాయని, ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టడానికి రైతుబంధు ఇస్తున్నారని పేర్కొన్నారు. మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజమని, దీనిని ప్రతిఒక్క రైతూ గమనిస్తున్నాడన్నారు. ఒకవేళ స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేకుంటే కచ్చితంగా ఈసారి కూడా రైతుబంధు ఎగ్గొట్టేవారన్నారు. రేవంత్రెడ్డి మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రకారం ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారని, చేయకపోగా ఎంపీ ఎన్నికల సమయంలో ఊరూరా తిరుగుతూ కనిపించిన ప్రతి దేవుడిపై ఒట్టు పెట్టుకుంటున్నారని తెలిపారు. ఎంపీ ఎన్నికలు పూర్తికాగానే కాలయాపన చేస్తూ చివరికి బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడికి తట్టుకోలేక సగం మందికి మాత్రమే రుణమాఫీ చేశారని తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పోలీస్ ఇన్వెస్టింగ్ అధికారిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ను జైలుకు పంపడమే లక్ష్యంగా మాట్లాడుతున్నాడని, ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టే కార్యక్రమాలు ఎక్కువ రోజులు సాగవని హెచ్చరించారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ట్యాపింగ్ కేసు విచారణలో ఉండగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. మహేశ్ కుమార్గౌడ్ పార్టీ అధ్యక్షుడు అని, ముఖ్యమంత్రి కాదన్నారు. జిల్లాకు మంత్రి పదవి రాకపోవడం అన్యాయమన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే అని, అందుకే బీజేపీ ఎంపీలు ఉన్న చోట మంత్రి పదవులు ఇవ్వడం లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు ఎకరాలున్న సగం మంది రైతులకు రైతుభరోసా ఎగ్గొట్టిందన్నారు. ఎగ్గొట్టిన రైతుభరోసా రూ.87, 500, రుణమాఫీ రూ.2 లక్షలు, వడ్ల బోనస్ మూడు సీజన్లకు కలిపి లక్షా 50వేలు అన్నీ కలిపి దాదాపు రూ. 4,37,500 బకాయి పడ్డారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా జీలుగ ధర రూ. 1,150 ఉండగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండింతలు (రూ. 2,140 )పెంచారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రాయితీపై విత్తనాలు ఇచ్చిందని, ప్రస్తుతం ఏ విత్తనాన్ని కూడా రాయితీపై ఇవ్వడం లేదన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులకు మూడు దఫాలుగా ఎగ్గొట్టిన వడ్లకు బోనస్, రైతు భరోసా, రుణమాఫీ బకాయిలు అన్నీ ఇచ్చాకనే, స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రావాలని, లేని పక్షంలో ప్రజలు తరిమికొడుతారని హెచ్చరించారు. ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు.