భీమ్గల్, ఫిబ్రవరి 9: పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మున్సిపల్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటువేసి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఓటర్లను కోరారు. సీఎం రేవంత్ రెడ్డి బాటలోనే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడాఅబద్ధాలు చెబుతూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన భీమ్గల్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. మూడు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులందరూ ఇక్కడికి దండుపాళ్యం బ్యాచ్లా వచ్చి నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ముగ్గురు, నలుగురు చైర్మన్లు ఇక్కడే తిష్ట వేసి ప్రచారం చేస్తున్నారని, వీరికి తోడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి వెళ్లాడని తెలిపారు.
కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, అన్వేశ్ రెడ్డి, తాహెర్బిన్ హందాన్ ప్రభుత్వ వాహనాల్లో పోలీసులను ముందూవెనుకా వేసుకొని గల్లీగల్లీతో తిరుగుతున్నారని మండిపడ్డారు.వీళ్లందరూ రెండేండ్ల నుంచి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవారు దవాఖాన భవన నిర్మాణ పనులు నిలిచిపోతే ఎందుకురాలేదని నిలదీశారు.రూ. 11 కోట్ల అభివృద్ధి పనులు ఆగినపుడు, మార్కెట్ బంద్ పడినపుడు ఎటుపోయారని ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసం అందరూ కలిసి కట్టకట్టుకుని వస్తున్నారన్నారు. తన ఒక్కడి మీదికి కాంగ్రెస్ వాళ్లందరూ కలిసి దండు కట్టారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకులు గడిచిన రెండేండ్లలో ఏం చేశారో చెప్పకుండా, మళ్లీ కొత్త పాటలు పాడుతున్నారని మండిపడ్డారు. రూ. 3 కోట్లతో బ్రిడ్జి రిపేర్ చేతగాదుగానీ రూ. 350 కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. రెండేండ్లలో ఒక్క రూపాయి కూడా ఎందుకు తేలేదన్నారు. మహిళలకు రూ. 2,500, పింఛన్ రూ. 4 వేలు, తులం బంగారం, స్కూటీలు ఇస్తామంటూ గతంలో రేవంత్ చెప్పిన అబద్ధాలనే మహేశ్కుమార్ గౌడ్ వల్లె వేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని సర్వే రిపోర్టు రావడంతో వీళ్లకు ఓటమి భయం పట్టుకుందన్నారు.
అందుకే అలవికాని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. తన పని అయిపోయిందని సభలో అంటున్నారని, తన పని అయిపోయిందోలేదో భగవంతుడు, నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. భూబకాసురల చేతిలో అధికారం పెడితే రాంబంధుల్లా దోచుకునేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి గడ్డం సుమనా రెడ్డి, కన్వీనర్ దొనకంటి నర్సయ్య, మాజీ జడ్పీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.