మోర్తాడ్, జూన్ 10: రేవంత్రెడ్డి కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ చట్టాన్ని గౌరవించి విచారణకు హాజరవుతున్నారని, ఆయనను ప్రత్యక్షంగా ఎదుర్కొనలేకనే నోటీసుల పేరుతో కాంగ్రెస్, బీజేపీలు కూడబలుక్కొని ఇబ్బందులు పెట్టాలని కుట్రలు చేస్తున్నాయని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. సబ్బండ వర్ణాలను కలుపుకుని సుదీర్ఘపోరాటం చేసి తెచ్చిన తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలపడానికి కేసీఆర్ పదేండ్లు అహోరాత్రులు కృషి చేశారని పేర్కొన్నారు. తెలంగాణ బాగును కాంక్షించిన కేసీఆర్పై విచారణ పేరిట వేధింపులకు గురి చేయాలని కాంగ్రెస్ చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వెంట తెలంగాణ సమాజం ఉన్నదని, కుట్రలను ఛేదించి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్పార్టీని దోషిగా నిలబెడుతామని, ప్రజాకోర్టులో శిక్షిస్తామని హెచ్చరించారు.
‘నేను టీడీపీ స్కూల్లో, బీజేపీ కాలేజీలో చదివాను, రాహుల్గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా..’ అంటున్న రేవంత్రెడ్డి.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఉద్యోగ ధర్మంలో విఫలమవ్వడంతో 45 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా రాహుల్గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు విద్యుత్పై కమిషన్ వేసి కేసీఆర్ను, ఫార్ములా- 1 లో విచారణ పేరిట కేటీఆర్ను, అలాగే పార్టీ నాయకులను ఏ అవకాశం దొరికినా కక్ష సాధిస్తూ ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 18నెలలకే కాంగ్రెస్ పాలన తెలంగాణకు శాపంగా మారిందని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే కేసులు, విచారణకు భయపడేదిలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ధైర్యంగా ఎదుర్కొన్నామని, ఇక ముందు కూడాఎదుర్కొంటామని పేర్కొన్నారు. కుట్రలను ఛేదిస్తూనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు పోరాడుతామని వేముల స్పష్టం చేశారు.