భీమ్గల్, నవంబర్ 6 : భీమ్గల్ పట్టణం గులాబీ మయమైంది. బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం నామినేషన్ వేసిన సందర్భంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు మంగళహారతులు, వలగొడుగులు, బోనాలు, రైతులు, యువకులు బైక్ ర్యాలీ ద్వారా స్వాగతం పలికారు. ర్యాలీ సుభాష్ నగర్ నుంచి బోదిరే గల్లీ, అంగన్వాడీ బజార్, నందిగల్లి, హరిజనవాడ మీదుగా ముచ్కూర్ చౌరస్తా వరకు సాగింది. ర్యాలీలో గులాబీల జెండలే పాటపై డ్యాన్సులు చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఫ్యామిలీ అండ్ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ డి.రాజేశ్వర్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కన్నే ప్రేమలత పాల్గొన్నారు.
వేల్పూర్, నవంబర్ 6: భీమ్గల్లో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్న సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం, రామాలయం లో వేముల ప్రశాంత్రెడ్డి, సతీమణి నీరజారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. భీమ్గ ల్ పట్టణంలో నామినేషన్ వేసిన తర్వాత వేముల భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వేముల దంపతులు లింబాద్రి గుట్టపై లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి స్వామివారి శేష వస్త్రం అందజేశారు. అనంతరం కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి కోటిలింగేశ్వర ఆలయంలో పూజలు చేశారు.
వేల్పూర్, నవంబర్ 6 : బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచా రం నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటలకు వేల్పూర్ మండలం కుకునూర్, 10.30 గంటలకు కోమన్పల్లి, 11.30 గంటలకు వెంకటాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు భీమ్గల్ మండలం బాబానగర్, 6 గంటలకు బాబాపూర్, 7 గంటలకు పురాణీపేట్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.