ఖలీల్వాడి, ఏప్రిల్ 24: తెలంగాణ కోసం కేసీఆర్ సారథ్యంలో ఏవిధంగా పోరాటం చేశామో.. ఇప్పుడే అదే తరహాలో ఉద్యమంలా రాష్ర్టాభివృద్ధి జరుగుతున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో వెనుకబడిన తెలంగాణను సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్ర స్వరూపాన్ని మార్చారని పేర్కొన్నారు. నగరంలోని పూసలగల్లీలో ఉన్న బాలాజీ భవన్ వద్ద 34,44,46, 47వ డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలతో సోమవారం రాత్రి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సమావేశానికి నాలుగువేల మంది హాజరుకాగా.. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఆడబిడ్డ పుడితే భారం అనుకున్న వారు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పెండ్లి చేసి ఘనంగా అత్తారింటికి పంపుతున్నారని చెప్పారు. తనను గెలిపించిన వారి రుణం తీర్చుకునేందుకు తన కానుకగా వధూ వరులకు కొత్త బట్టలు అందజేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించారని అన్నారు.
నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని చాలెంజ్గా తీసుకొని పూర్తిచేశామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తూ ఆసరా కల్పించి భరోసా ఇస్తోందన్నారు. నిజామాబాద్ నగరంలో 60 ఏండ్లలో జరగని అభివృద్ధి గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో జరిగినట్లు తెలిపారు. 25 కిలోమీటర్ల మేర సెంటర్ మీడియన్లు నిర్మించామన్నారు. హైదరాబాద్, వర్ని, ఆర్మూర్, బోధన్ రోడ్లను అభివృద్ధి చేశామని తెలిపారు.ప్రత్యేక కార్యాచరణతో తాగునీటి సమస్యను దూరంచేసి ప్రతి ఇంటికీ అందిస్తున్నట్లు చెప్పారు.
ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా రూ.25 లక్షలతో కోటగల్లీలో మార్కండేయ మందిరాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. హమాల్వాడీ సాయిబాబా సంతోషిమాత ఆలయ పునఃనిర్మాణం కోసం రూ. 50 లక్షల మంజూరుచేసినట్లు చెప్పారు. అయ్యప్ప స్వామి, విఠలేశ్వర ఆలయాలకు కూడా నిధులు మంజూరుచేశామన్నారు. రూ. 50 లక్షలతో పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మిస్తున్నామని చెప్పా రు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే వారి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరించాలని కోరారు. పార్టీకి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. వారికి ఎల్లప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్ష, కార్యదర్శులు సిర్ప రాజు, ఎనుగందుల మురళి, మాజీ మేయర్ ఆకుల సుజాత, సిర్ప కల్పన, నుడా డైరెక్టర్ మల్లేశ్ గుప్తా, 34, 44, 46,47వ డివిజన్ల కార్పొరేటర్లు బురుగుల పల్లి కల్పన, బైకాన్ మధు, అక్బర్ హుస్సేన్, మృదులా అరుణ్, మాజీ కార్పొరేటర్ కొండపాక రాజేశ్, జెండా బాలాజీ చైర్మన్ గోపాల్, గోల్హనుమాన్ చైర్మన్ నీలగిరి రాజు, సీనియర్ నాయకులు నవీద్ ఇక్బాల్, భూపతి, అనిల్ పాల్గొన్నారు.