ఖలీల్వాడీ, నవంబర్ 5: బీఆర్ఎస్ హయాంలో నగరం ఎంతో అభివృద్ధి చెందిందని, మున్ముందు మరింత అభివృద్ధి సాధించేందుకు తనను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని వినాయక మున్నూరుకాపు సంఘంలో ఏడు సంఘాలు, దుబ్బ ఎంకే గార్డెన్లో మరో ఏడు సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిగాల మాట్లాడారు. మున్నూరు కాపులను రాజకీయాల్లో వివిధ పదవుల్లో నియమించినట్లు తెలిపారు. ప్రతి మున్నూరుకాపు సంఘానికి కమ్యూనిటీ హాల్ కోసం నిధులు మంజూరు చేశామని గుర్తుచేశారు. 2014లో నగరం ఏ విధంగా ఉన్నదని, ప్రస్తుతం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలని కోరారు. డ్రైనేజీలు, రోడ్లు నిర్మించడంతోపాటు ఐటీ హబ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. అర్హులైన నగర యువతకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. గడపగడపకూ సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని, కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతూకిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, సూదం రవిచందర్, కోఆప్షన్ సభ్యుడు దారం సాయిలు, కార్పొరేటర్ ఆకుల హేమలత, శ్రీనివాస్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, ఆకుల శ్రీశైలం, గాండ్ల లింగం, పుప్పాల రవి, ఎర్రం గంగాధర్, పాల్గొన్నారు.
నగరంలో కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే బిగాల అన్నారు. ఏడు తర్పల పద్మశాలీ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ చీరెల తయారీతో చేనేత కార్మికులకు చేతినిండా పనిఉండేలా చేసిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. రూ.కోటితో పద్మశాలీ హాస్టల్ నిర్మాణం, రూ.కోటీ50లక్షలతో పద్మశాలీ కల్యాణ మండపం, రూ.25లక్షలతో భక్తమార్కండేయ ఆలయ పునర్నిర్మాణం, రూ.5లక్షలతో పద్మశాలీ ఉద్యోగల సంక్షేమ భవన్ తదితర పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు. గుజ్జేటి వెంకటనర్సయ్య, ఎనుగందుల మురళి, సిర్ప రాజు, సిరిగాధ ధర్మపురి, ఎస్ఆర్ సత్యపాల్, పుల్గం హన్మాండ్లు, యాదగిరి, మహేశ్, చింత మహేశ్, గురుచరణం, గంగరాజు, శివలింగం, మోహన్ పాల్గొన్నారు.
హస్మీ కాలనీ 52, 60 డివిజన్లలో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని అన్నారు. మైనార్టీలకు షాదీముబారక్తో లక్షా116 రూపాయలు అందించినట్లు గుర్తుచేశారు. మైనార్టీ బంధు ద్వారా రూ.లక్ష ఇచ్చి ఆర్థిక ఎదుగుదలకు ప్రోత్సహించిన ఘనత తెలంగాణ రాష్ర్టానిదేనని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, రెడ్కో మాజీ చైర్మన్ అలీం, మైనార్టీ నాయకులు మజాజ్అలీ, నవీద్ ఇక్బాల్, ఖుద్దుస్, అక్బర్హుస్సేన్ పాల్గొన్నారు.