ఖలీల్వాడి, అక్టోబర్ 26 : దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషిచేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో గురువారం నిర్వహించిన మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితులు ఆర్థికంగా వృద్ధి సాధించాలనే ఉద్దేశంతో దళితబంధు అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను స్థాపించి దళితులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నదని అన్నారు.విదేశాల్లో చదువుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అందిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నదని చెప్పారు. స్వరాష్ట్రంలో ఇందూరు నగరంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు.
చివరి మజిలీ గౌరవంగా సాగనంపేందుకు ఆధునిక సదుపాయాలతో వైకుంఠధామాలు నిర్మించినట్లు తెలిపారు. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ విశాలంగా మార్చి సెంటర్ మీడియన్ లైట్లను ఏర్పాటు చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి ఏర్పడ్డాక ప్రస్తుతం అందిస్తున్న పింఛన్ 2,016 నుంచి రూ.5వేలకు, కల్యాణలక్ష్మి ప్రోత్సాహకాన్ని రూ.1,00,116 నుంచి రూ. 2 లక్షలకు పెంచుతామన్నారు, మహిళలకు కేవలం 400 రూపాయలకే వంటగ్యాస్ను అందిస్తామని తెలిపారు. నగరం మరింత అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, కార్పొరేటర్లు కంపల్లి ఉమారాణీ ముత్యాలు, బట్టు రాఘవేందర్, మాజీ కార్పొరేటర్ కనకం సుధా సదానంద్, మాదిగ సంఘం నాయకులు సిద్ధి రాములు, దండు శేఖర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.