బోధన్ రూరల్/ కోటగిరి / చందూర్, ఏప్రిల్ 9: నిజామాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన హోరెత్తించింది. కోటగిరి, వర్ని, మోస్రా, పొతంగల్, చందూర్, బోధన్, సాలూరా మండలాల్లో చేతికొచ్చిన వరి పంట నేలరాలింది. అకాల వర్షం అన్నదాతకు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. ఉమ్మడి కోటగిరి మండలం సోంపూర్, టాక్లీ, దోమలెడ్గి, వల్లభాపూర్, సుంకిని తదితర గ్రామాల్లో వడగండ్ల వానకు సుమారు 500 నుంచి 600 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నేలమట్టమైందని వ్యవసాయాధికారులు చెప్పారు.
కోతకు వచ్చిన వరి గింజలు పూర్తిగా నేలరాలాయి. చేతికొచ్చిన పంట కండ్లఎదుటే నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చందూర్ మండల కేంద్రంతోపాటు లక్ష్మాపూర్, మేడ్పల్లి, లక్ష్మీసాగర్ తండాలో వడగండ్ల వానతో సుమారు 250 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. మెట్ట పంటలైన బెండ, సొరకాయ, గోరుచిక్కుడు లాంటివి కూడా రాళ్లవానకు దెబ్బతిన్నాయి. సాలూరా మండలంలోని హున్సా, మందర్న గ్రామాల్లో వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మందర్న శివారులో మామిడికాయలు రాలిపోయాయి. అకాల వర్షానికి సాలూర మండలంలో సుమారు 300 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
అకాల వర్షంతో చేతికొచ్చిన వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని, పంట నష్టపోయిన రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను మంగళవారం పరిశీలించారు. కోటగిరి, పొతంగల్, చందూర్ తదితర మండలాల్లో పర్యటించిన ఆయన బాధిత రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించామని, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఖాజాపూర్కు చెందిన సాయినాథ్ అనే రైతు టాక్లీలో 18 ఎకరాలు కౌలు తీసుకొని వరి సాగు చేయగా వడగండ్లకు పూర్తిగా నేలవాలిందని సురేందర్రెడ్డి ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. అతడిని సురేందర్రెడ్డి ఓదార్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్పటేల్, చందూర్ ఎంపీపీ లావణ్య, బీఆర్ఎస్ కోటగిరి మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, అంబర్సింగ్, సొసైటీ చైర్మన్ ప్యారం అశోక్, ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్,బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నా పేరు దివిటే మారుతి. టాక్లీ శివారులో 10 ఎకరాలు వడగండ్ల వానకు పూర్తిగా నష్టం జరిగింది. కోతకు వచ్చిన సమయంలో ఒక్కసారిగా వడగండ్ల వాన, ఈదురుగాలులకు వరిపంట దెబ్బతిన్నది. గింజలు పూర్తిగా రాలిపోయాయి. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలి.