ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లోనూ ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తడం లేదు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతున్నది. ఆర్మూర్ బల్దియాలో తాగునీటికి ఎస్సారెస్పీ బ్యాక్ వాటరే ప్రధాన వనరు. బ్యాక్ వాటర్ను బాల్కొండ, అర్గుల్లోని పంపుహౌస్కు తరలించి శుద్ధి చేసి సరఫరా చేస్తారు. వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్టులో నీరు అడుగంటుతుండడంతో సాగు, తాగునీటి ఇబ్బందులను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వర జలాలను ఎస్సారెస్పీలోకి తరలిస్తున్నది. దీంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటుండడంతో తాగునీటికి చింత లేకుండా పోయింది.
-ఆర్మూర్, జూలై 10
ఆర్మూర్, జూలై 10 : పల్లెలు.. పట్టణాల్లో బిందెడు నీటి కోసం మహిళల యుద్ధాలు.. బిందెడు నీటి కోసం రోడ్ల వెంట పరుగులు సమైక్య పాలనలో ఇవి నిత్య కృత్యాలు. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడంతో నీటి బిందె పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే మహిళ కనిపించకపోవడం మిషన్ భగీరథ పథకం పుణ్యమనే చెప్పవచ్చు…. నల్లా కనెక్షన్లు నేరుగా ఇంటి లోపలి వరకు ఇవ్వడంతో నీటి వ్యథ లేకుండా పోయింది. ఉదయం, సాయంత్రం రెండు పర్యాయాలు మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తుండడంతో నీటి కష్టాలు కనబడడం లేదు. రాష్ట్రంలో మిషన్ భగీరథ కనక్షన్ లేని పల్లె, పట్టణం లేదంటే ఆతిశయోక్తి లేదు. ఆర్మూర్ నియోజకవర్గంలో మొత్తం 57వేల కనెక్షన్ల కోసం రూ.508 కోట్ల ఖర్చుతో మిషన్ భగీరథను ఏర్పాటు చేయగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 15వేల కనెక్షన్లు ఉన్నాయి.
స్వచ్ఛమైన నీటి సరఫరా…
మిషన్ భగీరథ ద్వారా ఆర్మూర్ మున్సిపల్కు ప్రతినిత్యం స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ జలాల్పూర్ నుంచి కాళేశ్వరం బ్యాక్ వాటర్ను బాల్కొండకు తరలించి డబ్ల్యూటీపీ ద్వారా శుద్ధి చేసి ఆర్మూర్ పాత మున్సిపాలిటీలోని వివిధ కాలనీల్లోని ట్యాంకుల ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. మరోవైపు జలాల్పూర్ బ్యాక్ వాటర్ను జక్రాన్పల్లి మండలం అర్గుల్లోని పంపుహౌస్ తరలించి అక్కడి నుంచి ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి, పెర్కిట్ గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు.
గతంలో నీటి కోసం యుద్ధాలు
ఆర్మూర్ పట్టణంలో రాజారాంగర్ కాలనీతో పాటు టీచర్స్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, కింది బజార్, మీది బజార్, జిరాయత్నగర్, వాజ్పాయ్ నగర్, కమలనెహ్రుకాలనీ, పెర్కిట్, మామిడిపల్లి, మహాలక్ష్మి కాలనీ, ఎన్టీఆర్ నగర్ కాలనీల్లో గతంలో తీవ్ర నీటి ఎద్దడి ఉండేది. కాలనీల్లో భూగర్భజలాలు ఇంకిపోయి బోర్లు, చేతి పంపుల్లో నీళ్లు రాక ఇబ్బందులు పడేవారు. ఎండాకాలం వచ్చిందంటే ఆర్మూర్ బల్దియా ఆధ్వర్యంలో ట్యాంకర్లతో కాలనీల్లో నీటి సరఫరా చేసినప్పటికీ సరిపోక ప్రజలు ఇబ్బందులు పడేవారు. ట్యాంకర్ వచ్చందంటే నీటి కోసం చిన్నపాటి యుద్ధాలే జరిగేవి. రాజారాం నగర్ కాలనీలో నీటి కోసం జరిగిన గొడవలో ఓ యువకుడి ప్రాణం సైతం పోయింది.
ప్రస్తుతం కానరాని ట్యాంకర్లు
గతంలో ప్రైవేట్ ట్యాంకర్ల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లేది. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ ఉచితంగా నల్లా కనక్షన్ ఇవ్వడంతో ప్రజలకు నీటి ఇక్కట్లు తీరాయి. నీటి కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టే పని లేకపోవడంతో ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఫిల్టర్ చేసిన నీటిని ప్రతినిత్యం రెండు సార్లు సరఫరా చేస్తున్నారు. దీంతో ఫిల్టర్ నీటిని కొనగోలు చేయడం చాలా వరకు ప్రజలు మానేశారు. దీంతో నెలకు ఫిల్టర్ వాటర్ డబ్బాలకు అయ్యే ఖర్చు రూ. 300 నుంచి రూ.400 వరకు ఆదా అవుతున్నది. మిషన్ భగీరథతో ఆర్మూర్ పట్టణంలో చాలా వరకు వాటర్ ప్లాంట్లు మూత పడ్డాయి.
గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం..
గతంలో నీటి కోసం ఎన్నో తిప్పలు పడ్డాం. ఒక రోజు నల్లాలు వస్తే మరో రోజు రాకపోయేది. ఒక్కోసారి రెండు,మూడు రోజులు కూడా వచ్చేది కాదు. ఉన్న నీటినే పొదుపుగా వాడుకునే వారిమి. మున్సిపల్ నీటి ట్యాంకర్లు కాలనీకి వస్తే బిందెడు నీటి కోసం మాటల యుద్ధాలు జరిగేవి. కానీ ఇప్పుడు అ పరిస్థితి లేదు. మిషన్ భగీరథతో నీటి కష్టాలు తీరాయి. రోజుకు రెండు పూటలా నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి కోసం అసలు ఎలాంటి ఇబ్బంది పడుతలేం.
-మీరా లక్ష్మి, ఆర్మూర్
ఉచితంగా అందిస్తున్నారు
ముందు నీటి కోసం డబ్బులు చెల్లించే వారివి. అయినా నీళ్లు సక్రమంగా వచ్చేవి కావు. వేసవి కాలంలో అయితే ట్యాంకర్లకు రూ.100 నుంచి రూ.200 వరకు డబ్బులు చెల్లించి నీటిని కొనుగోలు చేశాం. కానీ ఇప్పుడు కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ పథకంతో ఉచితంగా నీటిని పొందుతున్నాం. స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నారు. ఇవే నీళ్లు తాగుతున్నాం. ఫిల్టర్ వాటర్ డబ్బాలు బంద్ చేశాం. ఆర్మూర్లో మంచి నీళ్లు అందిస్తున్న ఎమ్మెల్యే జీవన్రెడ్డికి కృతజ్ఞతలు.
-పద్మ, ఆర్మూర్
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ నల్లాలు వచ్చాయి. ఒకప్పుడు నీటి ఎద్దడి ఎక్కువ ఉండేది. ఉదయం లేచింది మొదలు నీటి కోసమే తంటాలు పడేవాళ్లం. ఇప్పుడు ఆ బాధలు లేకుండా పోయాయి. ప్రతి ఇంటికీ కనక్షన్ ఇవ్వడంతో ఇండ్లలోనే నీటిని పట్టుకుంటున్నాం. ఉచితంగా అందించడం గొప్ప విషయం. ఇంతటి గొప్ప పథకం రూపొందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-వరలక్ష్మి, హౌసింగ్బోర్డ్ కాలనీ, ఆర్మూర్