సుభాష్నగర్/ కామారెడ్డి, ఏప్రిల్ 9: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన వేడుకలను మంగళవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సర వేడుకల్లో భాగంగా ఆలయాల్లో అభిషేకాలు ప్రత్యేక పూజలతోపాటు పంచాంగ శ్రవణాలు, ఉగాది పచ్చడి వితరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. నిజామాబాద్లోని నీలకంఠేశ్వరాలయం, శంభులింగేశ్వరాలయం, ఉత్తర తిరుపతి క్షేత్రం, జెండా బాలాజీ మందిరం, పెద్దరాంమందిర్, చక్రంగుడి, సుభాష్నగర్ రామాలయం, లక్ష్మీగణపతి ఆలయం, వాసవి కన్యకా పరమేశ్వరీ ఆలయం, ఉమా మహేశ్వరాలయం… తదితర దేవాలయాల్లో ఉగాది వేడుకలను సంప్రదాయంగా నిర్వహించారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నవ నాయకులు అశుభంగా ఉండడంతో పాడి పంటలు ఆశించినంతగా ఉండవని ప్రజలకు, రాజుకు మధ్య వ్యతిరేకత ఎక్కువవుతుందని పండితులు పంచాంగ శ్రవణంలో తెలిపారు. ధరలు బాగా పెరుగుతాయని గురు, శుక్ర మౌడ్యములు ఉండడంతో ఆరు నెలలపాటు శుభకార్యాలకు ముహూర్తాలు లేవన్నారు. వేద పండితులు చంద్రశేఖర్ శాస్త్రీ, సముద్రాల శ్రీధరాచారి, ప్రశాంత్జోషి, మధుసూదన్శర్మ తదితరులు వివిధ ఆలయాల్లో పంచాంగ శ్రవణం చేశారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు మాజీ స్పీకర్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉగాది పర్వదినం సందర్భంగా వీక్లీ మార్కెట్లోని దుర్గమ్మ ఆలయ ఆవరణలో ఎడ్లబండ్ల ప్రదర్శన అట్టహాసంగా నిర్వహించారు. ఎడ్లను, బండ్లను అందంగా అలంకరించారు. ఎడ్లబండ్ల ప్రదర్శనను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో ఆలయ ఆవరణ మొత్తం సందడి వాతావరణం నెలకొన్నది. ఈ ఏడాది మొత్తం ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు కోరారు. అంతకుముందు ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, వేదపండితులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.