రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు సజీవ దహనం
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
మృతులు జగిత్యాల జిల్లా వాసులు
వేల్పూర్, జూన్ 27 : వేల్పూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల గ్రామానికి చెందిన మండలోజి అనిల్ కుమార్(24), కోరుట్లకు చెందిన బెజోజ సుమంత్(24)ఆల్టో కారులో ఆదివారం అర్ధరాత్రి ఆర్మూర్ వైపు బయల్దేరారు. వీరి కారు వేల్పూర్ ఎక్స్రోడ్డు సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో రోడ్డు పక్కనే బోల్తాకొట్టడంతో కారులో మంటలు వ్యాపించాయి. కారులో నుంచి బయటికి వెళ్లే దారిలేకపోవడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు.అర్ధరాత్రి కావడంతో వీరిని ఎవరూ కాపాడలేకపోయారు. ఇద్దరు యువకులు అగ్నికి ఆహుతయ్యారు. మృతదేహాలు కనీసం గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఓ వ్యక్తి ఈ దారి గుండా వెళ్తుండగా గమనించి 100 నంబర్ కాల్ చేయడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. విషయం తెలుసుకున్న వేల్పూర్ ఎస్సై వినయ్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు
వేల్పూర్ ఎక్స్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు సజీవ దహనం కావడంతో కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాలు గుర్తు పట్టడానికి కూడా వీలు లేకుండా ఉండడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
చేతికి అంది వచ్చిన కుమారులను కోల్పోయిన రెండు కుటుంబాలు
మెట్పల్లి మండలం వెల్లుల గ్రామానికి నారాయణ-విజయకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు మండలోజి అనిల్ కుమార్ మెట్పల్లిలో గోల్డ్స్మిత్ పని చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. ఉన్న ఒక్క కుమారుడూ మృతి చెందడంతో తండ్రి నారాయణ సంఘటనా స్థలంలో కుప్పకూలిపోయాడు. కోరుట్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్-రాధలకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉన్న ఒక్క కుమారుడు సుమంత్ ప్రమాదంలో మృతి చెందడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. సుమంత్ మెట్పల్లిలోని ప్రైవేటు దవాఖానలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు.
స్నేహంలోనూ వీడని బంధం
వేల్పూర్ ఎక్స్రోడ్డు సమీపంలో జరిగిన ప్రమాదంలో సజీవ దహనమైన ఇద్దరు మంచి స్నేహితులు. తమ బంధువుల కారును తీసుకొని ఆర్మూర్ వస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ప్రతి రోజూ ఎటు వెళ్లినా కలిసి వెళ్లేవారు. చివరికి రోడ్డు ప్రమాదంలో కూడా ఇద్దరూ మృతి చెందడంతో మిగతా స్నేహితులు కంటతడి పెట్టుకున్నారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ సీఐ గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. వేల్పూర్ ఎస్సై వినయ్ మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలు గుర్తు పట్టలేకుండా కాలిబూడిదవ్వడంతో చలించిపోయారు.