ఈ ఏడాది ఆర్మూర్, డొంకేశ్వర్, నందిపేట, ఆలూర్, వేల్పూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్, బాల్కొండ మండలాల పరిధిలో సాగుచేసిన పసుపు పంటకు దుంపకుళ్లు, మర్రి ఆకు తెగుళ్లు సోకి రైతులను ఇబ్బంది పెట్టాయి. దిగుబడిని దెబ్బతీసే తెగుళ్ల నివారణకు రైతులు చేయని ప్రయోగం లేదు. ఇదిలా ఉండగా స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయం సిబ్బంది మాత్రం రైతులకు ఎలాంటి సలహాలు, సూచనలూ ఇవ్వలేదు. పంటలో కొత్త పరిశోధనలు దేవుడెరుగు.. తెగుళ్లపై కనీసం అప్రమత్తం చేయలేదు.
దీంతో ఎక్స్టెన్షన్ కార్యాలయంతో ఉపయోగమేంటంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాని మోదీనే స్పైసెస్ బోర్డు ప్రకటన చేసినా ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కాలేదు. నవంబర్లో శ్రీకారం చుట్టినా ఎప్పటికి ఏర్పాటు చేస్తారనే విషయంపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇదంతా చూస్తుంటే మళ్లీ ఇది రాజకీయ ఇంద్రజాలమని అంటున్నారు. రూపాయి ఖర్చు లేకుండా హైదరాబాద్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోనే పసుపు బోర్డును పెట్టి మమ అనిపించేలా బీజేపీ భారీ గేమ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.