నిజామాబాద్ రూరల్, మే 24 : బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలని, వారిని, వారి కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికులుగా పని చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించాలన్నారు. పార్టీ అంటే తల్లి లాంటిదని, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి చేదోడువాదోడుగా నిలుస్తూ మనుగడనిచ్చేది పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.
నిజామాబాద్ రూరల్ మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని నగర శివారులోని పవార్ గార్డెన్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విద్వేషాలను రెచ్చగొడుతూ మతకల్లోలాన్ని సృష్టిస్తున్న బీజేపీని భూస్థాపితం చేద్దామన్నారు. క్యాడర్ లేని కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మొద్దని సూచించారు. మతం పేరిట రాజకీయం చేస్తున్న బీజేపీని ప్రజలు నమ్మడంలేదని, కర్ణాటక ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారని అన్నారు. తెలంగాణ పల్లెలు జాతీయస్థాయంలో అవార్డులు సాధించి అభివృద్ధి సూచీలుగా నిలిచాయని గుర్తుచేశారు. సీసీ, బీటీ రోడ్లు నిర్మించి రవాణా వ్యవస్థను మెరుగుపర్చినట్లు చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ.. ఇవి దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
లక్షల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే విపక్షాల దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ.. హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని బాజిరెడ్డి ధీమా వ్యక్తంచేశారు.
ఎలాంటి పదవిలో లేనప్పుడు తాను కూడా సాధారణ కార్యకర్తగా జెండాను మోశానని బాజిరెడ్డి గుర్తు చేశారు. నిచ్చెన వేసి గోడలకు ప్రచార పోస్టర్లను అతికించానని చెప్పారు. కష్టపడితేనే నేడు పదవులు వరించాయని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడినప్పుడే పదవులకు సార్థకత ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీజీగౌడ్ను నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్రావు, ఎంపీపీ అనూషా ప్రేమ్దాస్, జడ్పీటీసీ బొల్లెంక సుమలతా గోపాల్రెడ్డి, నుడా డైరెక్టర్ ముస్కె సంతోష్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్గౌడ్, సీనియర్ నాయకులు బాగారెడ్డి, అంకల గంగాధర్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు అశోక్, కార్పొరేటర్లు కొర్వ లలితా గంగాధర్, శ్రీనివాస్రెడ్డి, యమునా అనిల్, సొసైటీ చైర్మన్లు దాసరి శ్రీధర్, జితేందర్, పైసా స్వామి, సర్పంచులు శ్రీనివాస్రెడ్డి, సురేందర్రెడ్డి, నాయకులు జమీర్ఖాన్, ఆజాం, అక్బర్, స్వామి పాల్గొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణపై ఆంధ్రా పాలకులు వివక్ష చూపారు. 60 ఏండ్లపాటు వారి పాలనలో జరగని అభివృద్ధి.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేండ్లలోనే సీఎం కేసీఆర్ చేసి చూపించారు. భారీగా నిధులు మంజూరుచేసి ఆదరణ కోల్పోయిన కృలవృత్తులకు జీవం పోశారు. సాగునీరు, కరెంటు వంటి రైతాంగం సమస్యలను పూర్తిగా పరిష్కరించడంతో నేడు వ్యవసాయం పండుగలా మారింది. వేల కోట్ల రూపాయలతో రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బాజిరెడ్డి గోవర్ధన్కే దక్కింది. ఆయనకు ప్రజలు అండగా నిలబడాలి.
-వీజీగౌడ్, మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటా వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉన్నది. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి. విపక్షాల మాటలను ప్రజలు నమ్మి మోసపోకుండా చైతన్యపర్చాలి. కార్యకర్తల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న బాజిరెడ్డి గోవర్ధన్ను ఈసారి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులు భుజస్కందాలపై ఉన్నది.
-దాదన్నగారి విఠల్రావు, జడ్పీ చైర్మన్, నిజామాబాద్