డిచ్పల్లి, ఏప్రిల్ 4 : మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో ఉన్న బృందావన్ గార్డెన్లో మంగళవారం నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్టీసీ చైర్మన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
కాపులు ఐకమత్యంగా ఉంటూ ఆర్థిక, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. కాపు వసతి గృహాల ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సంఘ జిల్లా అధ్యక్షుడిగా ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవన్న, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, సంఘ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.