కామారెడ్డి, మే 28 : తాను చెప్పిన ప్రకారం, చెప్పిన సమయానికి తన ఇంటిని కూల్చేందుకు పొక్లెయిన్తో వచ్చానని, తాను విసిరిన సవాల్కు బీజేపీ నేత వెంకటరమణారెడ్డి తోకముడిచారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్రావు అన్నారు. రోడ్డు వెడల్పు పనులకు జన్మభూమి రోడ్డులోని నిట్టు వేణుగోపాల్రావు తండ్రి ఇంటితో పాటు పలువురి ఇండ్లు అడ్డుగా ఉన్నాయని బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అన్నారు. దీనిని సవాల్గా తీసుకున్న నిట్టు వేణుగోపాల్రావు ఇటీవల సమావేశం నిర్వహించి ఈనెల 28న ఉదయం 10 గంటలకు తన తండ్రి ఇంటిని పొక్లెయిన్తో కూల్చివేయిస్తానని, కాటిపల్లి వెంకట రమణారెడ్డి కూడా తన ఇంటిని కూల్చివేయించి చిత్తశుద్ధిని నిరూపించుకుందామని సవాల్ విసిరారు. చెప్పిన ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు జన్మభూమి రోడ్డులో ఉన్న తన తండ్రి నిట్టు విఠల్రావు ఇంటి వద్దకు నిట్టు వేణుగోపాల్రావు పొక్లెయిన్తో వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలవరకు అక్కడే ఉండి వెంకటరమణారెడ్డికి సమయం ఇచ్చారు.
స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పట్టణంలోని జన్మభూమి రోడ్డు కిక్కిరిసిపోయింది. బీజేపీ నేత వెనక్కి తగ్గిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ సందర్భంగా నిట్టు వేణుగోపాల్రావు మాట్లాడుతూ.. ఇద్దరం ఒకేసారి ఇండ్లను కూల్చివేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని విసిరిన సవాల్కు కాటిపల్లి వెంకట రమణారెడ్డి తోకముడిచారని అన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కళాశాలకు 25 ఎకరాల భూమిని కేటాయించినప్పుడు ఆ కమిటీలో సభ్యుడివి కాదా అని ప్రశ్నించారు. కుంటిసాకులు చెప్పకుండా నిజాయితీగా తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని అన్నారు. గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు, స్థానిక గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని, ధర్నాలు, నిరసనలు చేపట్టి, వారం తర్వాత ఎందుకు వెనుదిరిగావో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంబాల రవియాదవ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్రెడ్డి , పట్టణ మాజీ అధ్యక్షుడు గడ్డం చంద్రశేఖర్రెడ్డి, కౌన్సిలర్లు నజీరుద్దీన్, ముప్పారపు ఆనంద్, నిట్టు కృష్ణమోహన్, మీర్జా హఫీజ్ బేగ్, శంకర్రావు, చాట్ల వంశీ, కాసర్ల స్వామి, మాసుల లక్ష్మీనారాయణ, ఇమ్రాన్, సలీం, గరిగంటి లక్ష్మీనారాయణ, మామిండ్ల రమేశ్, నాయకులు సబ్బని కృష్ణహరి, గడ్డమీది మహేశ్, పిట్ల వేణు పాల్గొన్నారు.