దశాబ్దాల కలను సాకారం చేయడానికి పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. సీఎం కేసీఆర్ పోరాట పటిమతో గమ్యాన్ని ముద్దాడింది. ఎనిమిదేండ్ల సుపరిపాలనతో తెలంగాణ భారతావనికి దిక్సూచిగా నిలిచింది. అయితే, దేశంలో విద్వేష రాజకీయాలు విస్తరిస్తున్న వేళ జాతి ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ మరో ముందడుగు వేసింది. జాతిని జాగృతం చేయడానికి టీఆర్ఎస్.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా రూపాంతరం చెందింది. విజయదశమి రోజున గోల్కొండ కోట నుంచి ఎర్రకోటకు ప్రయాణాన్ని ప్రారంభించింది. తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్.. నవ భారత నిర్మాణానికి నడుం బిగించారు. జాతీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు దసరా నాడు ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు సంబురాల్లో మునిగిపోయారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. జాతి జాగృతి కోసం బయల్దేరిన కేసీఆర్కు మద్దతు ప్రకటించారు.
– నిజామాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మత పిచ్చిగాళ్ల చేతుల్లో మాడి మసి అవుతున్న భారతదేశాన్ని కాపాడేందుకు తెలంగాణ పులిబిడ్డ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నడుం బిగించారు. ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకుంటూ దేశాన్ని అధోగతికి గురిచేస్తున్న భారతీయ జనతా పార్టీని తరిమికొట్టేందుకు దసరా పర్వదినాన కేసీఆర్ శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి సర్వసభ్య సమావేశం వేదికగా గులాబీ ముఖ్య నేతల సమక్షంలో తన నిర్ణయాన్ని గులాబీ అధినేత స్పష్టం చేశారు. బీజేపీ ఆడుతున్న నిరంకుశ రాజకీయ క్రీడలపై ఉవ్వెత్తున మండిపడుతున్న తెలంగాణ సీఎం నేరుగా ఢిల్లీ పెద్దలతో ప్రజాస్వామ్య బద్ధంగా ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితిగా మనుగడ సాధించిన పార్టీ ఇకపై భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) రూపంలో జాతీయ స్థాయిలో ప్రభావం చూపేందుకు రెడీ అయ్యింది. దేశ ప్రజలకు సుభిక్ష పాలన అందించడమే లక్ష్యంగా కేసీఆర్ వేసిన ముందడుగుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశ్కీ నేత కేసీఆర్ అంటూ ప్రజలంతా నినదిస్తూ సంబురాలు చేసుకుంటున్నారు.
ప్రతికూలతల నుంచి అనుకూలతల వరకు..
ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా వ్యూహాత్మకంగా అనుకూలంగా మలచుకోవడంలో కేసీఆర్ దిట్ట, నేర్పరి. నాడు తెలంగాణ బానిస సంకెళ్లను తెంపారు. సాధించుకున్న తెలంగాణను సమూలంగా అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారు. కేసీఆర్ వ్యూహం, చతురత, దూరదృష్టి, విషయ పరిజ్ఞానం, సంకల్పం, పట్టుదల దేశానికి కొత్త తొవ్వ చూపిస్తుందనడంలో సందేహం లేదు.
కేసీఆరే సరైనోడు..
ఘన కీర్తి గడించిన మన భారతదేశం ప్రస్తుతం ప్రమాదపు అంచుల్లో చిక్కుకున్నది. విద్వేషపు మంటల్లో కొట్టుమిట్టాడుతున్నది. దేశం మళ్లీ ప్రగతి మార్గంలో నడవాలంటే, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలంటే దేశానికి సరైన నాయకుడు కావాలి. కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు దేశానికి అవసరమని ప్రజలు భావిస్తున్నారు.
బీజేపీపై ఛీత్కారాలు..
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అరాచకాలపై ప్రజలకు ఛీత్కార భావం పెరుగుతున్నది. కమలం పార్టీని తిరస్కరించిన రాష్ర్టాల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని బీజేపీ వ్యవహరిస్తున్నది. బీజేపీ అనాలోచిత నిర్ణయాలతో ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్టకు భంగం వాటిల్లిందనడంలో సందేహం లేదు. ఈ అంశాలపై మేధావి వర్గాలతో సీఎం కేసీఆర్ చర్చించారు. భిన్నమైన దారుల్లో నడుస్తున్న భారతదేశ స్థితిగతులను మార్చడానికి తానే జాతీయ రాజకీయాల్లో వస్తానంటూ బయల్దేరడంతో ప్రజలంతా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు.