కంఠేశ్వర్, మార్చి 2: పార్లమెంట్ ఎన్నికల కోసం చేపడుతున్న ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సీపీ కల్మేశ్వర్తోకలిసి సహాయ రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, భద్రతాపరమైన ఏర్పాట్లు, అంతర్రాష్ట్ర సరిహద్దులు, జిల్లా సరిహద్దుల వద్ద చెక్పోస్ట్లు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు.
పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సెక్టోరల్ అధికారులకు వచ్చే వారం రోజుల వ్యవధిలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి విధులు, బాధ్యతలపై తర్ఫీదునివ్వాలని సూచించారు. ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలకు సైతం శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి సి-విజిల్ యాప్, ఈఎస్ఎంఎస్ యాప్లను వారు ఇన్స్టాల్ చేసుకునేలా సూచించాలన్నారు. ప్రధానంగా ఎన్నికల సంఘానికి వెంటనే నివేదికలను ఈఎస్ఎంఎస్ యాప్ ద్వారా పంపాల్సి ఉంటుందన్నారు. అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.