నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 3 : భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయిని, బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో విద్యా వెలుగులు నింపిన సామాజికవేత్త సావిత్రీబాయి ఫూలే జయంతిని జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు పూలమాలలు వేసి, సమాజ హితం కోసం ఆమె చేసిన కృషిని కొనియాడారు.
నగరశివారులోని గూపన్పల్లి జడ్పీహెచ్ఎస్లో హెచ్ఎం శకుంతలాదేవి సావిత్రీబాయి ఫూలే గురించి విద్యార్థులకు వివరించారు. సిరికొండ మండలం ముషీర్నగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సావిత్రీబాయి చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. టీయూలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సావిత్రీబాయి చిత్రపటానికి ప్రిన్సిపాల్ ఆరతి, వివిధ విభాగాధిపతులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీయూ ఆవరణలో పీడీఎస్యూ నాయకులు, ఏబీవీపీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు తోట సాయికృష్ణ ఆధ్వర్యంలో సావిత్రీబాయి జయంతిని నిర్వహించారు. నగరంలోని ఐటీఐ ప్రాంగణంలో ఉన్న సావిత్రీబాయి విగ్రహానికి బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్కుమార్, సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందల్వాయిలోని బాలికల ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో పీడీఎస్యూ జిల్లా ప్రధానకార్యదర్శి కర్క గణేశ్ ఆధ్వర్యంలో సావిత్రీ బాయి జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, ప్రజాపంథా, పీడీఎస్యూ నాయకులు పాల్గొన్నారు.
చందూర్ మండలంలోని లక్ష్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సావిత్రీబాయి ఫూలే జయంతిని ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. వర్ని మండల కేంద్రంలో సీపీఎం కార్యాలయంలో నాయకుడు నన్నేసాబ్ ఆధ్వర్యంలో సావిత్రీబాయి జయంతిని నిర్వహించారు. నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘురాజ్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. రాష్ట్రస్థాయి బీచ్వాలీబాల్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు ఆకాశ్, విజ్ఞాన్, రాజును అభినందించారు. వేల్పూర్లో బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మొండి అశోక్ ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే జయంతి నిర్వహించారు. మోర్తాడ్ భవిత భవనం, పాలెం ప్రాథమికోన్నత పాఠశాల, భీమ్గల్ మండలంలోని జాగిర్యాల్ పాఠశాల, ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద, బోధన్ పట్టణంలోని మెప్మా కార్యాలయం, నందిపేట్, మాక్లూర్ మండలంలోని దాస్నగర్ మహత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, ముప్కాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సావిత్రీబాయిఫూలే జయంతి నిర్వహించారు.