కంఠేశ్వర్, మే 21 : జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఇటీవల ట్రాన్స్జెండర్ల రాకపై గ్రామకమిటీలు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయమై కలెక్టర్ ఇలా త్రిపాఠి మానవతా దృక్పథంతో స్పందిస్తూ సమస్యకు పరిష్కారం చూపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి ట్రాన్స్జెండర్లు, సర్పంచులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిరికొండ మండలం మైలారం గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనతోపాటు మరికొన్ని గ్రామాల్లో జరిగిన ఉదంతాలపై కలెక్టర్ ఇరువర్గాల వాదనలు విన్నారు.
వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభోత్సవాలు వంటి సమయాల్లో ట్రాన్స్జెండర్లు గ్రామాల్లోకి వచ్చి బలవంతంగా పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, నిరాకరిస్తే అనుచిత ప్రవర్తనతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని సర్పంచులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ట్రాన్స్జెండర్ల వేషధారణలో కొంతమంది నకిలీలు సైతం వస్తున్నారని వారితో మరింతగా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. దీంతో గ్రామస్తుల ఏకాభిప్రాయం మేరకు ట్రాన్స్జెండర్ల రాకపై నిషేధం విధిస్తూ తీర్మానాలు చేశామని వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం కలెక్టర్ ఆమోదయోగ్యమైన రీతిలో సయోధ్య కుదిర్చారు. నకిలీల బెడదను నివారించేందుకు అర్హత కలిగిన, వాస్తవంగా ట్రాన్స్జెండర్లు అయిన వారికి సమగ్ర నిర్ధారణ చేసి జిల్లా సంక్షేమశాఖ ద్వారా గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో డీపీవో శ్రీనివాస్రావు, ఏసీపీ ప్రకాశ్యాదవ్, పద్మ, రాజబాబు, ట్రాన్స్జెండర్లు, సర్పంచులు పాల్గొన్నారు.