కోటగిరి, నవంబర్ 2 : శిక్షణలో భాగంగా జిల్లాకు వచ్చిన ట్రైనీ అధికారులు మండలంలోని ఎత్తొండలో బుధవారం పర్యటించారు. క్యాంప్ సమీపంలో పలువురు రైతులు సాగుచేస్తున్న వరి, పసుపు పంటలతోపాటు సీతాఫలాల తోటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వరి, పసుపు పంటకు పెడుతున్న పెట్టుబడి, దిగుబడి, ఆదాయం తదితర అంశాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాం కును సందర్శించారు. ఖాతాదారులకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించగా.. గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలు గురించి హెల్త్ సూపర్వైజర్ కృష్ణవేణి వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు బాగుందని ట్రైనీ అధికారులు తెలిపారు.
పర్యటించిన వారిలో (ఏఎస్వో) ట్రైనీ అధికారులు అభినవ్ సరోహా, అంకన్ మారిక్, దీప్తీ యాదవ్, నీరజ్ కుమా రీ మీనా, అనామికా పాల్ ఉన్నారు. వారి వెంట సర్పంచ్ సిరిగిరి సాయిబాబా, ఉపసర్పంచ్ సుజాత, ఎంపీటీసీ ఫారూఖ్, మాజీ సర్పంచ్ ఆనంద్, ఏవో శ్రీనివాసరావు, ఏఈవో సందీప్, పంచాయతీ కార్యదర్శి ఉమాకాంత్, ఏఎన్ఎం సరోజ, పంచాయతీ సిబ్బంది రాజేశ్వరి, లలిత, శంకర్, ఆశ కార్యకర్తలు ఉన్నారు.