నిజాంసాగర్, మార్చి 10: గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు, తాగునీరు సరఫరా చేసేందుకు, మొక్కల పెంపకం కోసం ట్యాంకర్లను కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పంచాయతీలకు ట్రాక్టర్లు వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసింది. కేసీఆర్ సర్కారు సంకల్పం ఫలించింది. గ్రామాలన్నీ ఆదర్శంగా మారా యి. అలాంటిది ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం పడకేసింది. కేసీఆర్ ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్లు మూలనపడ్డాయి. ఇందుకు నిదర్శనమే నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, బ్రాహ్మణపల్లి, ఆరెపల్లి గ్రామాలు. జీపీలకు కేటాయించిన ట్రాక్టర్ నాలుగు నెలలుగా మూలకు చేరింది. మరమ్మతుల పేరిట ట్రాక్టర్ను పక్కనపెట్టడంతో చెత్త సేకరించేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఫలితంగా మురికి కాల్వల నుంచి తీసిన చెత్త 20రోజులుగా రోడ్లపైనే ఉంటున్నది. ఇంటింటికీ చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ వెళ్లకపోవడంతో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేస్తున్నారు. ట్రాక్టర్ మరమ్మతుతో ట్యాంకర్ సైతం షెడ్డుకే పరిమితమైంది. దీంతో బృహత్ పల్లెప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోతున్నాయి. బ్రాహ్మణపల్లి గ్రామంలోని ట్రాక్టర్ పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. పది నెలలుగా పక్కన పెట్టారు. దీంతో ట్యాంకర్ను గ్రామస్తులు వినియోగిస్తుండగా, చెత్త సేకరించడం మరిచిపోయారు. ఇక ఆరేపల్లి గ్రామంలో ఆరు నెలల కిందట ట్రాక్టర్ మరమ్మతుకు గురికావడంతో అది చెట్టు కిందికి చేరింది. ట్యాంకర్ను ఇతరులు వినియోగించుకుంటున్నారు. గ్రామంలోని నర్సరీలో మొక్కలకు నీటిని అందించేందుకు ట్యాంకర్ లేకుండా పోయింది. నర్సరీలో ఉన్న బోరు మోట రు సైతం నెల రోజుల క్రితం పాడైపోవడంతో ఇటు ట్యాంకర్ లేక అటు మోటరు పనిచేయక నర్సరీలోని మొక్క లు ఎండిపోతున్నాయి.
పట్టించుకోని అధికారులు..
ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాలు పడకేశాయి. ట్రాక్టర్లు మరమ్మతులకు గురికావడంతో వాటి గురించి పట్టించుకునే వారు లేకుండా పోయారు. దీనికి తోడు మొక్కల పెంపకం, పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తుండడంతో గ్రామాల్లో అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తున్నది. ఈ విషయమై మండల పంచాయతీ అధికారి అబ్బాగౌడ్ను వివరణ కోరగా ట్రాక్టర్లు పాడైపోయిన విషయం ఈ రోజే తెలిసిందని, సంబంధిత పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడి వివరాలు సేకరిస్తానని దాటవేయడం గమనార్హం.