బిచ్కుంద, జూన్ 26: ఇసుక అందక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుకను రవాణా చేయడానికి ట్రాక్టర్ యజమానులు అధిక ధరలకు తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం భారంగా మారింది. బిచ్కుంద మండలంలో 663 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి.
ఇందులో కొన్ని ఇండ్ల నిర్మాణాలు ఇంకా పూర్తికాలేదు. పూర్తికాకపోవడానికి ఇసుకరవాణా చార్జీలు భారం కావడమే కారణమని తెలుస్తోంది. గతంలో ఇసుక రవాణాకు ట్రాక్టర్ యజమానులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని లబ్ధిదారులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి సంబంధిత శాఖల అధికారులు, ట్రాక్టర్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల దూరాన్ని బట్టి ధరలను నిర్ణయించారు. అయితే అధికారులు నిర్ణయించిన ధరలకు కాకుండా ట్రాక్టర్ యజమానులు అందినకాడికి దండుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఇసుక రవాణా చార్జీలు అధిక మొత్తంలో వసూలు చేయడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
అధికారులు నిర్ణయించిన ధరలకు కాకుండా అధిక ధరకు సరఫరా చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే కయ్యానికి కాలు దువ్వుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇటీవల బిచ్కుంద పట్టణానికి చెందిన ఓ లబ్ధిదారుడు మండంలోని ఓ గ్రామంలో ఇసుక రీచ్ వద్దకు ఇసుక కోసం వెళ్లాడు. అక్కడ అధికారులు నిర్ణయించిన ధరకు కాకుం డా ట్రాక్టర్ యజమానులు ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేశారు. ఇదేంటని సదరు లబ్ధిదారు ప్రశ్నిస్తే దాడిచేసినట్లు సమాచారం. ఈ విషయమై లబ్ధిదారుడు స్థానిక పోలీస్టేషన్తోపాటు తహసీల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
ఇంతజరుగుతున్నా అధికారులు తమకేమీపట్టనట్లుగా వ్యవహరిస్తుండడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అధిక ధరలకు సరఫరా చేస్తున్న ట్రాక్టర్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఎస్సై రాజుని వివరణ కోరగా.. ఘటన చోటుచేసుకున్నది వాస్తవమే అని, ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తహసీల్దార్ వేణు గోపాల్ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని, విచారణ చేపట్టి అధిక ధరలకు సరఫరా చేయకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.